మోసం చేసేందుకు కేటుగాళ్లు ఏమైనా చేసేలా ఉన్నారు. ఏకంగా భారత దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా వాడేసుకున్నారు. గతంలో పోలీస్ యూనిఫామ్లో కొంతమంది ఫేక్ పోలీసులు మోసాలకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది.. మోసగాళ్లు బాగా అప్డేట్ అయ్యారు. రేంజ్ పెంచేసి.. ఏకంగా ఫేక్ సీఐడీ, సీబీఐ, సుప్రీం కోర్టు, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్లంటూ భారీ భారీ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి మోసానికి పాపం ఓ రిటైర్డ్ ఉద్యోగి దారుణంగా బలయ్యాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాప్రాకు చెందిన రిటైర్ట్ ప్రైవేట్ ఉద్యోగి ఒంటరిగా నివాసముంటున్నాడు. ఆయనకు ఈ నెల 16న ఢిల్లీ పోలీసులమంటూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. సదరు ఉద్యోగి ఆధార్ నంబర్తో జరిగిన లావాదేవీల కారణంగా మనీలాండరింగ్ కేసు నమోదైందని, సుప్రీంకోర్టు, ఆర్బీఐ నుంచి నోటీసులు వచ్చాయని అన్నారు. దాంతో ఆ రిటైర్డ్ ఉద్యోగి హడలిపోయాడు. ఆ నోటీసులపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పి, విచారణ కోసం ఢిల్లీకి రావాలి చెప్పారు. అలా రాలేకపోతే తామే వచ్చి, అరెస్ట్ చేయాల్సి ఉంటుందని బెదిరించారు.
ఢిల్లీకి రాకుండానే కేసు విచారణ జరిపించాలంటే.. కోర్టుకు సెక్యూరిటీకి డబ్బు కట్టాలని చెప్పారు. తాము చెప్పిన ఖాతాలో డబ్బులు వేయాలని, ఆ డబ్బంతా సుప్రీంకోర్టు ఆధీనంలో, ఆర్బీఐ ఖాతాలో డిపాజిట్ అవుతుందని చెప్పారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని తేలిన తర్వాత ఆ డబ్బును తిరిగి వెనక్కి ఇస్తామని చెప్పుకొచ్చారు. ఇలా నాలుగు రోజుల్లోనే రూ.22.05 లక్షలను వేయించుకున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని, వాట్సాప్లో వీడియో కాల్ చేశారు. అయితే.. వాట్సాప్లో విచారణ ఏంటో అని అనుమానం వచ్చిన బాధితుడు ఈ విషయాన్ని తనకు తెలిసిన వాళ్లకు చెప్పడంతో.. అయ్యో.. ఇదంతా స్కామ్ అండి అని వాళ్లు చెప్పడం సైబర్ నేరగాళ్ల మోసం బయటపడింది. వెంటనే బాధితుడు 1930కు ఫోన్ చేసి, రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి