Polavaram Five Star Luxury Resort: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అమరావతి, పోలవరం, తిరుపతిలో కొత్త హోటళ్లు, రిసార్ట్ల నిర్మాణానికి ప్రోత్సాహకాలు ప్రకటించింది. గ్రీన్ పార్క్ హోటల్స్ అమరావతిలో, మెగ్లాన్ లీజర్స్ పోలవరంలో, పావని హోటల్స్ తిరుపతిలో భారీ పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ ప్రాజెక్టులకు ఎస్జీఎస్టీ, స్టాంపు డ్యూటీ రాయితీలతో పాటు స్థిర మూలధన పెట్టుబడిలో రాయితీలు లభించనున్నాయి. దీని ద్వారా పర్యాటకం అభివృద్ధి చెందడంతో పాటు ఉద్యోగాలు కూడా వస్తాయని అధికారులు తెలిపారు.
హైలైట్:
- ఏపీలో మరో ఫోర్ స్టార్ హోటల్ ఏర్పాటు
- పోలవరం దగ్గర ఫైవ్ స్టార్ లగ్జరీ రిసార్ట్
- ఆమోదం తెలిపిన ఆంధ్రప్రదేశ్ సర్కార్

ఏపీలో కొత్తగా రూ.145 కోట్లతో ఫోర్ స్టార్ హోటల్.. రూ.255 కోట్లతోఫైవ్ స్టార్ లగ్జరీ రిసార్ట్.. ఆ ప్రాంతానికి మహర్దశ
అమరావతిలో గ్రీన్ పార్క్ హోటల్ ఏర్పాటు చేయడం వల్ల 250 మందికి ఉద్యోగాలు వస్తాయంటున్నారు. అలాగే మెగ్లాన్ లీజర్స్ సంస్థకు పోలవరం ప్రాజెక్టు పక్కన 15.25 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.ఈ రిసార్ట్ నిర్మాణానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా అందిస్తుంది. ఈ రిసార్ట్ రాకతో 350 మందికి ఉపాధి దక్కుతుందంటున్నారు. ‘ఈ భూమిని ప్రభుత్వం 66 ఏళ్ల పాటు లీజుకు భూమిని ఇచ్చింది. ప్రాజెక్టు విజయవంతమైతే మరో 33 ఏళ్లు పొడిగించే అవకాశం ఉంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిర్ణయించిన విలువ ఆధారంగా వార్షిక లీజు ఉంటుంది.. దీనిపై 1% అదనపు డెవలప్మెంట్ ప్రీమియం చెల్లించాలి. ప్రతి మూడేళ్లకు ఇది 5% పెరుగుతుంది’ తెలిపారు అధికారులు. అంతేకాదు తిరుపతిలో పావని హోటల్కు కూడా ప్రభుత్వం రాయితీలు ఇవ్వనుంది. ఈ హోటల్ రూ.80.46 కోట్లతో నిర్మించనున్నారు. ఇప్పటికే పలు ప్రైవేట్ హోటల్స్ ఏపీలో పెట్టుబడులుపెట్టేందుకు ముందుకు వచ్చాయి.. ఈ మేరకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది.