మావోయిస్టుల పేరుతో ఇటీవలె మంత్రి సీతక్కపై ఒక లేఖ వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆ లేఖపై సీతక్క స్పందించారు. ఆ లేఖలో ములుగులో ఆదివాసీల గెంటివేతపై ఎందుకు మాట్లాడటం లేదు? తెలంగాణలో ఆదివాసీల పరిరక్షణ బాధ్యత సీతక్కదే, ముకేశ్ అంబానీ, గౌతం అదానీల కోసమే జీవో 49. ఆ జీవోతో కుమ్రంభీం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు మాయం కావడం పక్కా! ఆదివాసీల గురించి రాహుల్గాంధీ చెప్తున్నదేమిటి? రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు చేస్తున్నదేమిటి? పోడు భూములకు పట్టాలు, రైతుభరోసా ఇవ్వాలంటూ మావోయిస్టు రాష్ట్ర కమిటీ పేరుతో ఒక లేఖ సంచలనం సృష్టించింది. అది నిజంగానే మావోయిస్టులు రాసిన లేఖనా? లేక ఎవరైనా కావాలని తనపై కుట్రతో లేఖను సృష్టించారా అని అనుమానం వ్యక్తం చేస్తూ.. దానిపై నిజం తేలాల్సి ఉందని అన్నారు.
ఇంకా మంత్రి మాట్లాడుతూ.. “నాపై మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ బాధాకరం. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో తొలిసారి ఆదివాసి బిడ్డకు మంత్రి పదవి దక్కితే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. నా పర్శనాలిటీని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు. అది మావోయిస్టుల లేఖా..? లేక నేనంటే గిట్టని వాళ్లు కుట్ర పూరితంగా సృష్టించిన లేఖా..? అనేది తేలాల్సి ఉంది. ఆ లేఖను ముందుపెట్టి కొందరు నాపై రాజకీయ కక్షను వెళ్లగక్కుతున్నారు.
నన్ను ఓడించాలని నాడు వంద కోట్ల వరకు పెట్టారు. నాకు మంత్రి పదవి వచ్చినప్పటినుండి ఎప్పుడు దించాలి అని చూస్తున్నారు. GO 48ను రద్దు చేయాలని తీర్మానం చేశాం. ప్రతిపక్షంలో పోరాటం.. అధికారంలో సమస్యల పరిష్కారమే నా బాధ్యత. నేను ఒక మహిళను అని కూడా చూడకుండా బాధాకరంగా ప్రచారాలు చేస్తున్నారు. అట్టడుగు వర్గాల కోసమే నా పోరాటం.. ఆరాటం. గత ప్రభుత్వంలో చెట్లకు కట్టేసి కొట్టారు. ఆదివాసి బిడ్డను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. నిన్నటిదాకా అధికారంలో ఉన్నది మీరే కదా.. ఆదివాసీలకు ఎందుకు భూమి ఇవ్వలేదు.” అని మంత్రి సీతక్క అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి