వారిద్దరు ప్రాణ స్నేహితులు. ఏ సమస్య వచ్చిన ఇద్దరు చర్చించుకునే వారు. నిత్యం కుటుంబం కోసం ఆలోచించేవారు. కానీ.. ఇద్దరు వరకట్నం రక్కసికి బలయ్యారు. చివరికి ప్రాణాలే తీసుకున్నారు. జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన ఇద్దరు స్నేహితురాళ్ళు అదనపు వరకట్న దాహానికి బలయ్యారు. ఈ దుర్ఘటనలు వేరువేరుగా జరిగినప్పటికీ స్నేహితురాళ్ళు ఇద్దరు అనూహ్యంగా ఒకే రోజు మృత్యు ఒడిలోకి చేరుకోవడం అందరి హృదయాలను కలచివేస్తోంది. ఒకే రోజు ఇద్దరు చనిపోవడంతో.. ఈ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
అదనపు వరకట్న వేధింపులకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఇద్దరు వివాహితలు బలయ్యారు. మృతులలో ఒకరు తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్కు చెందిన రోడ్డ మమత కాగా, మరొకరు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ప్రగతి నగర్ కు చెందిన అనూష. తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ లోని ఓ డెయిరీలో పని చేస్తున్న వీరిద్దరు మంచి స్నేహితులు. అయితే ఆ ఇద్దరూ ఒకే సమస్యతో సతమతమవుతున్నారు
అదనపు వరకట్న వేధింపులను తాళలేక జూన్ 23వ తేదీన వేర్వేరు చోట్ల పురుగుల మందు సేవించారు స్నేహితులు. అయితే ఇద్దరు చికిత్స పొందుతూ గురువారం(జూన్ 26) మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. ఈ ఉదంతం మృతుల కుటుంబసభ్యులను తోటి ఉద్యోగులను తీవ్రంగా కలిచివేస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరికీ వరకట్న వేధింపులు పెరిగాయి. చాలా సార్లు పంచాయతీలు జరిగినా, ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలోనే ఇద్దరు స్నేహితురాళ్లు లోలోపల కుమిలిపోయారు. చివరికి ఒకే రోజు లోకం విడిచి వెళ్లిపోయారు..!
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..