చలామణిలో లేని రూ.2వేల నోట్లతో రెట్టింపు ఆదాయం పొందవచ్చని ఆశచూపుతూ ఓ ముఠా మోసాలకు పాల్పడుతున్న ఘటన తిరుపతి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..చలామణిలో లేని రూ.2వేల నోట్లకు తగు ఆధారాలు చూపి రిజర్వు బ్యాంకులో మార్చు కోవచ్చని చెప్తూ..తమ వద్ద ఎక్కువ మొత్తంలో రూ. 2 వేల నోట్లున్నాయని.. కోటి విలువ చేసే రూ.500 నోట్లు ఇస్తే రూ.2 వేల నోట్లు రెట్టింపు ఇస్తామని నమ్మబలికింది. తీరా వాళ్ల నుంచి డబ్బులు ముట్టాక రూ.2 వేల నోట్లు ఇవ్వకుండానే పరారైంది. ఈ కేసును ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి జిల్లా ఎస్సీ హర్షవర్ధనరాజు ముందు హాజరు పరిచారు.
శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ కు చెందిన అంబటి సంతోష్, ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన బర్రి రవితేజ, తిరుపతికి చెందిన హేమకర్రావు. విశాఖపట్నంలోని కంచర్లపాలెంకు చెందిన మామిడి ఉమా మహేష్, దేంతి రెడ్డి, హరిబాబు.. వీరంతా కలిసి ఓ ముఠాగా ఏర్పడి మాస్టర్ గేమ్ ఆడారు. ఇందులో భాగంగానే తమ వద్దనున్న రూ.2 వేల నోట్ల కట్టను చూపుతూ కథ నడిపించారు. రూ.లక్ష రూ.500 నోట్లు ఇస్తే రూ.రెండు లక్షలకు సంబందించి రెండువేల నోట్లు ఇస్తామని ప్రజలను నమ్మించారు. రిజర్వు బ్యాంకులో ఎవరైనా తెలిసుంటే ఈ రెండువేల నోట్లను ఈజీగా మార్చుకోవచ్చని చెప్పి అమాయకుల నుంచి డబ్బులు గుంజడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే సూళ్లూరుపేట చెందిన మినీ ఏటీఎం నిర్వాహకుడు జగదీష్తో డీల్ కుదుర్చుకున్నారు. అనుకున్న ప్రకారం జగదీష్ వాళ్లకు రూ.కోటి విలువ చేసే రూ.500 నోట్లు ఇచ్చారు. డబ్బులు తీసుకున్న తర్వాత ఇస్తామని చెప్పిన రెండువేల నోట్లు ఇవ్వకుండానే ఆ ముఠా అక్కడి నుంచి పరారైయింది. ఫోన్ చేసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాత నేరస్తులు, గతంలో జరిగిన ఈ తరహా ఘటనలపై దృష్టి పెట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహించారు. వేలి ముద్రల ఆధారంగా నిందితులను గుర్తించి..ముఠా కదలికలను పసిగట్టారు. ఈ క్రమంలోనే అంబటి సంతోష్, బర్రి రవితేజ, ఉమామహేష్తో పాటు మరికొందరిని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.73.20 లక్షల నగదు, రెండు వాహనాలతో పాటు రూ. 2 వేల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసులో కీలక నిందితులుగా ఉన్న దొంతిరెడ్డి హరిబాబు రెడ్డి పరారీలో ఉండగా పట్టుబడ్డ వారంత పాత నేరస్థులుగా పోలీసులు భావిస్తున్నారు. నిందితులపై రౌడీ షీట్లు, పలు పోలీస్ స్టేషన్ల లో కేసులు ఉన్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..