
ఇటీవల కాలంలో చాలామంది లగ్జరీ లైఫ్ను లీడ్ చేయడం కోసం ఏం చేయడానికైనా సిద్దపడుతున్నారు. తమకు నచ్చిన జీవితాన్ని గడపాలన్న ఆశలో కొందరు అప్పుల్లో మునిగిపోతుంటే.. మరికొందరు తప్పుడు మార్గాలను ఎంచుకుంటూ జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. ఇలా ఈజీ మనీకోసం అలవాటు పడిన ఓ వ్యక్తి దొంగనాలు చేస్తూ ఏకంగా 26 సార్లు అరెస్టయ్యాడు. చాంద్రాయణగుట్ట డివిజన్ ఏసీపీ ఎ. సుధాకర్ ఇచ్చిన వివరాల ప్రకారం .. ఫతేదర్వాజా ప్రాంతానికి చెందిన మహ్మద్ సలీం అలియాస్ సునీల్ శెట్టి ( 51) చిన్నప్పటి నుంచే దొంగతనాలకు పాల్పడుతున్నాడు. చిన్ననాటి నుంచి కుటుంబానికి చెందిన కిరాణా షాప్లో పని చేస్తూ.. తన ప్రియురాలితో బయట తిరగాలన్న కోరికతో అదే షాపులో దొంగతనం చేశాడు. ఇది తల్లిదండ్రులకు తెలిసిన తర్వాత ఇంటి నుంచి పారిపోయాడు.. అప్పటి నుంచే ఇలా నగరంలోని పలు చోట్ల దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన డబ్బుతో జల్సాలు సాగిస్తున్నాడు.
అయితే 18ఏళ్ల వయసులోనే ఇత్తడి పాత్రల దొంగతనం కేసులో తొలిసారి అరెస్టైన సలీం.. జైలు నుంచి వచ్చాక మళ్లీ దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. ఇలానే చేస్తూ.. చేస్తూ దొంగతనాల్లో ఆరితేరాడు. ఇప్పటివరకు హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో 150కి పైగా దొంగతనాలు చేశాడు. అందులో 25సార్లు పోలీసులకు చిక్కాడు. దొంగతనాల ద్వారా వచ్చిన డబ్బుతో ముంబై, అజ్మేర్ వంటి పర్యాటక ప్రాంతాలకు హెలీకాప్టర్లో ప్రయాణిస్తూ ఖర్చు జల్సాలు చేసేవాడు.
ఏప్రిల్ 11న బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఇళ్లలో చోరీలు చేసి అరెస్టయిన అతడు..మే నెలలో జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. అయిన తన టార్గెట్ మార్చుకోక 26వసారి మళ్లీ అరెస్టయ్యాడు. పోలీసులు అతడి వద్ద నుంచి రూ. 70,000 నగదు, 35 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..