పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో వరద ప్రవాహంలొ ఒకే కుటుంబానికి చెందిన 18 మంది చిక్కుకున్నారు. వరద ప్రవాహంలో ఏడుగురు కొట్టుకుపోయారు. దీంతో వాళ్లను కాపాడడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
కొద్ది రోజులుగా ఉత్తరాదిని భారీ వర్షాలు, వరదలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అత్యవసరం అయితే తప్ప జనం బయటకు వచ్చే పరిస్థితి లేదు. రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కులులోని సైంజ్ వ్యాలీలో క్లౌడ్బరస్ట్ అయింది. ప్రమాదకర స్థాయిలో పార్వతి నది ప్రవహిస్తుంది. నదీ పరివాహక ప్రాంతంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఆట్-లహ్రి-సైంజ్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
అటు గుజరాత్ను భారీవరదలు ముంచెత్తాయి. వరదల ధాటికి సూరత్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడ్రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. రాబోయే రెండ్రోజుల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. జమ్ము కశ్మీర్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరిగింది. పలు నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి.