ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ వరకు చేపట్టిన పిజెఆర్ ఫ్లై ఓవర్ శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్ ప్రజలకు.. ముఖ్యంగా ఐటీ కారిడార్లో ప్రయాణించేవారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఫ్లైఓవర్తో గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గడమే కాదు.. ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది.
ఈ ఫ్లైఓవర్ను వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమం(SRDP) కింద రూ. 182.72 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇది 1.2 కి.మీ పొడవు, 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లతో ఉంటుంది. ఇంకో ఆసక్తికర విశేషమేమిటంటే.. ఇది ఇప్పటికే ఉన్న రెండు ఫ్లైఓవర్లపై నిర్మించిన మూడవ నిర్మాణం.
ఈ ఫ్లైఓవర్ కింద గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్.. అలాగే దాని పైన శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తోంది. ఈ ఫ్లైఓవర్ గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యను చాలా వరకు తగ్గిస్తుంది. ORR నుంచి కొండాపూర్, హఫీజ్పేట్ మార్గాలకు వెళ్లే వాహనాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.
ఇది హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. అలాగే ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకోకుండా ప్రయాణీకులను గమ్యస్థానాలకు వేగంగా చేరుస్తుంది. కొండాపూర్ ప్రాంతం నుంచి శంషాబాద్ విమానాశ్రయం.. అక్కడి నుంచి కొండాపూర్ ప్రాంతాలకు.. గచ్చిబౌలి వద్ద ఎలాంటి ట్రాఫిక్ జామ్లు లేకుండా నేరుగా చేరుకోవచ్చు.
నగర అభివృద్ధి కోసం రూ. 7032 కోట్ల వ్యయంతో 28 ఫ్లైఓవర్లు, 13 అండర్పాస్లు, 4 ROBలు, 03 రైల్వే అండర్బ్రిడ్జిలు, 10 రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులు టెండర్ దశలో పూర్తి కాగా.. ఒప్పంద దశకు చేరుకున్నాయి. కొన్ని త్వరలోనే ప్రారంభం కానున్నాయి.