విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో విశాఖ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2021 ఏప్రిల్ 15వ తేదీన పెందుర్తి పీఎస్ పరిధిలో జుత్తాడలో బత్తిన అప్పలరాజు అనే వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి కుటుంబ సభ్యులను అత్యతంత కిరాతకంగా వెంటాడి మరీ హత్య చేశాడు. ఒళ్లు గగుర్లు పుట్టించేలా కనిపించిన ఈ హత్యా దృశ్యాలు,ఈ ఘటన అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసులు అన్ని సాక్ష్యాలు సమర్పించడంతో ఈ కేసులో అప్పలరాజును దోషిగా తేల్చిన కోర్టు అతనికి మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఈ హత్యలు ఎప్పుడు, ఎందుకు జరిగాయి..
2021 ఏప్రిల్ 15న పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. అయితే ఇదే గ్రామానికి చెందిన బత్తిన , బొమ్మిడి కుటుంబాల మధ్య కొంతకాలంగా వివాధాలు ఉన్నాయి. మొదట తన కుమార్తెను బమ్మిడి రమణ కొడుకు విజయ్ లవ్ చేశాడని..అప్పలరాజు రమణ కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా తన కూతురికి మత్తు పదార్థాలు ఇచ్చి తను వేధించాడని ఆరోపించాడు. కేసు విచారణ సమయంలో.. తన కుమార్తె జీవితం నాశనం కావడానికి, అందుకు బమ్మిడి రమణ కుటుంబమే కారణమని పగపెంచుకున్న అప్పల రాజు.. వాళ్లపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకొని.. ఏప్రిల్ 15న బమ్మిడి రమణ ఇంటికి వెళ్లి వాళ్ల ఇంట్లోని కుటుంబ సభ్యులను అతికిరాతకంగా కత్తితో నరికి చంపినట్టు పోలీసులు తెలిపారు.
ఈ హత్యల తర్వాత నిందితుడు అప్పలరాజు కత్తి పట్టుకొని నేరుగా పెందుర్తి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పథకం ప్రకారమే అప్పలరాజు ఈ హత్యలు చేసినట్టు నిర్ధారించి, సాక్షాధారాలతో అతన్ని కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా విచారణ జరిపిన న్యాయ స్థానం అప్పలరాజును దోషిగా తేలుస్తూ.. అతనికి మరణశిక్ష విధించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..