మంగళూరు, జూన్ 28: దేశంలోనే ఖ్యాతి పొందిన ఐఐటీ-ముంబాయిలో సీటు సంపాదించడం అంతా ఆషామాషీ కాదు. అలాంటిది ఓ యువకుడు ఎలాంటి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయకుండానే క్యాంపస్లోకి ప్రవేశించాడు. ఏదో చుట్టం చూపుగా ఒక్క రోజు పని మీద వచ్చిన అతగాడు.. అక్కడే పాతుకుపోయాడు. ఒక్కరోజు కూడా బయటకు పోయిన దాఖలాలు లేవు. నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్లో ఉంటున్నట్లు తాజాగా అధికారులు గుర్తించడంతో అసలు విషయం బయటపడింది. అంతే వెంటనే అరెస్ట్ చేసి జైల్లో వేశారు. నిందితుడిని కర్ణాటకలోని మంగళూరుకు చెందిన బిలాల్ తేలిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బిలాల్ తేలి అనే వ్యక్తి కొంతకాలం క్రితం ఓ కార్యక్రమం కోసం ప్రముఖ విద్యా సంస్థ అయిన ఐఐటీ ముంబాయికి వచ్చాడు. బిలాల్ కేవలం ఒక రోజు అధ్యయన కార్యక్రమం కోసం క్యాంపస్లోకి ప్రవేశించాడు. అయితే ఆ తర్వాత నుంచి అతడు క్యాంపస్లోనే ఉండి ఉపన్యాసాలకు హాజరు కావడం మొదలుపెట్టాడు. ఒక్క సారి కూడా బయటకు పోయింది లేదు. బిలాల్ వద్ద సరైన అడ్మిషన్ పత్రాలు లేకుండా ఐఐటీ-బొంబాయిలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు క్యాంపస్ యాజమన్యం గుర్తించింది. దీంతో అతనిపై ఫిర్యాదు చేయడంతో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతడు క్యాంపస్లో తరగతులకు హాజరవుతున్నాడని తేలింది. తాజాగా ఓ ప్రొఫెసర్ బిలాల్ను ఐడీ కార్డు చూపించమని అడగటంతో ఈ వ్యవహారం బయటపడింది.
జూన్ 2-7 మధ్య అతను క్యాంపస్లో మొదట కనిపించాడని, ఆ తర్వాత కొంతకాలం కనిపించకుండా పోయాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. జూన్ 17న అతను మళ్లీ క్యాంపస్లో కనిపించడం అనుమానాలకు తావిచ్చినట్లు తేలింది. పోలీసులు బిలాల్ను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అతని వద్ద ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లేవని, అతని నుంచి ఇప్పటివరకు ఎటువంటి అనుమానాస్పద వస్తువులు స్వాధీనం చేసుకోలేదని పోలీసులు తెలిపారు. అయితే బిలాల్ అసలు క్యాంపస్లోకి రావడం వెనుక ఉద్దేశ్యం ఏమిటి? అతను ఇంతకాలం ఎలా గుర్తించబడకుండా ఉన్నాడు? అతనికి ఎవరైనా క్యాంపస్లో ఎవరైనా సహకరిస్తున్నారా? అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.