వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని రేకలకుంట గ్రామంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. స్థానిక రైతు కూనపులి రాజశేఖర్ నాయుడు తన పొలాన్ని దుక్కి దున్నుతుండగా పురాతన విగ్రహం బయటపడింది. ఈ విగ్రహం చూసిన రాజశేఖర్ ఆశ్చర్యానికి గురయ్యారు. చరిత్రకారుడు, రచయిత బొమ్మిశెట్టి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విగ్రహం 18వ శతాబ్దానికి చెందినదిగా తెలిపారు. ఇది ఒక మహిళ విగ్రహమని, ఎడమ వైపున కొప్పు ఉంటే.. కుడి చేతిలో పుష్పం పట్టుకుని ఎంతో అందంగా ఉందని వివరించారు.
విగ్రహంలో కాళ్లు, చేతులకు కడియాలు ధరించినట్టు కనిపిస్తుందని.. నాటి శిల్పకారుల నైపుణ్యాన్ని ఈ విగ్రహం ప్రతిబింబిస్తున్నదని రమేష్ తెలిపారు. విగ్రహం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నందున.. ఇది ఆ ప్రాంత చారిత్రక ప్రాముఖ్యతను తెలియజేస్తుందన్నారు. ఈ విగ్రహం ఆ కాలం శిల్పకళా నైపుణ్యానికి కూడా ఓ ఉదాహారణ అని ఆయన అభిప్రాయపడ్డారు. రైతు రాజశేఖర్ పొలంలో బయటపడిన ఈ విగ్రహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు.

Ancient Artifact
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..