కేంద్ర ప్రభుత్వం సోమవారం పీపీఎఫ్, ఎన్ఎస్సీ, సుకన్య సమృద్ధి యోజన, ఇతర చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సమీక్షించనుంది. సవరించిన రేట్లు ఏవైనా ఉంటే ఆర్థిక సంవత్సరం 2025-26 జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి వర్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 2025లో ఇప్పటివరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ చాలా పోస్టాఫీసు పొదుపు సాధనాల్లో వడ్డీ రేట్లను మార్చలేదు. కానీ బాండ్ దిగుబడిలో గణనీయమైన తగ్గుదల, భారత రిజర్వ్ బ్యాంక్ వరుస రెపో రేటు కోతలతో రాబోయే సమీక్షలో ఈ వడ్డీ రేట్లను సవరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ ఇటీవల కీలక రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రెపో రేటు 5.5 శాతానికి చేరింది. రెపో రేటు కోతలతో పాటు బాండ్ ఈల్డ్లు కూడా తగ్గాయి. జూన్ 26, 2025 నాటికి, 10 సంవత్సరాల ప్రభుత్వ బాండ్ ఈల్డ్ 6.269 శాతం వద్ద ఉంది.
చిన్న పొదుపు రేట్లు పరోక్షంగా ప్రభుత్వ బాండ్ల రాబడికి అనుసంధానించి ఉండటం వల్ల ఈ తగ్గుదల తప్పనిసరి అని నిపుణులు భావిస్తున్నారు. మార్చి 24 నుంచి ఇప్పటివరకు సగటు 10 సంవత్సరాల జీ-సెక్ రాబడి 6.325 శాతం వద్ద ఉంది. ప్రామాణిక 25 బీపీఎస్ స్ప్రెడ్ను జోడిస్తే పీపీఎఫ్ రేటు ఫార్ములా ద్వారా కచ్చితంగా సర్దుబాటు చేస్తే 6.575 శాతానికి తగ్గుతుంది. కానీ ఈ రేటు ప్రస్తుతం 7.10 శాతంగా ఉంది. ఈ లెక్కింపు ప్రకారం మార్కెట్ రేట్ల తగ్గుదలకు అనుగుణంగా చిన్న పొదుపు రేట్లను తగ్గించాలి. అయితే తుది నిర్ణయం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే ముందు ఇతర స్థూల ఆర్థిక, రాజకీయ అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చ.
చిన్న పొదుపు పథకాల్లో కింది స్థాయి ప్రజలకు కీలకమైన పొదుపు సాధనంగా పనిచేస్తాయి కాబట్టి ఈ నిర్ణయం విషయంలో ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరిస్తాయి. 2026 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో చిన్న పొదుపు వడ్డీ రేట్లలో తగ్గింపు ఉండే అవకాశం ఉందని మార్కెట్ పరిస్థితులు సూచిస్తున్నప్పటికీ తుది నిర్ణయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్ 30న ప్రకటిస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక డిపాజిట్ల కోసం ప్రస్తుత రేట్లను లాక్ చేయాలని ప్లాన్ చేస్తుంటే పెట్టుబడిదారులు ఈ ప్రకటనను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..