పాకిస్తాన్లోని వజీరిస్తాన్ జిల్లాలో శనివారం ఆత్మాహుతి దాడి కలకలం రేపింది. సైనికులే లక్ష్యంగా జరిగిన దాడిలో సుమారు 13 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిరు. “ఒక ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని సైనిక కాన్వాయ్పైకి దూసుకెళ్లాడు. ఈ పేలుడులో 13 మంది సైనికులు మరణించారు, 10 మంది సైనిక సిబ్బంది, 19 మంది పౌరులు గాయపడ్డారు” అని పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలోని స్థానిక ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
అంతే కాకుండా ఈ పేలుడు ధాటికి రెండు ఇళ్ల పైకప్పులు కూలిపోయాయని, ఆరుగురు పిల్లలు గాయపడ్డారని తెలిపారు. దాడి జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారని.. గాయపడిన సైనికులతో పాటు స్థానికులను హస్పిట్లకు తరలించారని తెలిపారు. గాయపడిన వారిలో నలుగురు సైనికుల పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. వారు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు.
అయితే పాకిస్తాన్ తాలిబన్ (TTP) తో చేతులు కలిసిన హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్కు చెందిన ఆత్మాహుతి విభాగం ఈ ఆత్మహుతి దాడి తామే చేసినట్టు ప్రకటించింది. 2021లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..