శరీరంలో సోడియం, పొటాషియం రెండూ ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు. ఇవి శరీరంలో విద్యుత్ సంకేతాలను నియంత్రిస్తాయి, కండరాల కదలికలను ప్రేరేపిస్తాయి, ద్రవ స్థాయిలను నియంత్రిస్తాయి. ఈ రెండూ ఆహారం ద్వారానే శరీరానికి అందుతాయి. సోడియం కణాల వెలుపల పనిచేస్తుంది. శరీరంలో నీటిని నిలుపుదల చేసి, రక్తనాళాలపై ఒత్తిడి పెంచి రక్తపోటును పెంచుతుంది. పొటాషియం కణాల లోపల ఉండి, మూత్రపిండాలను ప్రేరేపించి రక్తం నుండి సోడియంను తొలగిస్తుంది. తద్వారా సోడియం స్థాయిలను తగ్గించి, అధిక రక్తపోటు దుష్ప్రభావాల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.
పొటాషియం పెంచితే బీపీకి చెక్..
రక్తపోటును తగ్గించే పొటాషియం సామర్థ్యం గురించి కొంతకాలంగా తెలుసు. అయితే, అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ రీనల్ ఫిజియాలజీ అధ్యయనం సోడియం, పొటాషియంల మధ్య పరస్పర చర్యలను, ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి అవసరమైన నిష్పత్తిని పరిశీలించింది. పరిశోధకులు ఆశ్చర్యకరమైన విషయాలు కనుగొన్నారు. సోడియం తగ్గించడం కంటే ఆహారంలో పొటాషియం పెంచడం రక్తపోటుపై ఎక్కువ రక్షణాత్మక ప్రభావాన్ని చూపుతుందని పరిశోధన వెల్లడించింది.
“సాధారణంగా, అధిక రక్తపోటు ఉన్నప్పుడు ఉప్పు తక్కువ తినమని సలహా ఇస్తారు,” అని అధ్యయన రచయితలలో ఒకరైన వాటర్లూ యూనివర్సిటీకి చెందిన అనితా లేటన్ తెలిపారు. “అరటిపండ్లు లేదా బ్రోకలీ లాంటి పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోవడం, సోడియంను తగ్గించడం కంటే రక్తపోటుపై మంచి సానుకూల ప్రభావాన్ని చూపుతుందని మా పరిశోధన సూచిస్తుంది.” ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడింట ఒక వంతు పెద్దలను అధిక రక్తపోటు ప్రభావితం చేస్తుంది. ఇది గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు, మతిమరుపు లాంటి అనేక పరిస్థితులకు ప్రమాద కారకం. పురుషులలో అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ అధ్యయనం ప్రకారం, రక్తపోటుపై పొటాషియం రక్షణాత్మక ప్రభావం పురుషులలో మరింత స్పష్టంగా ఉంది.
పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలు
అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఒక అరటిపండులో 400 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. అరటిపండు తినడం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో పీచు పదార్థం అధికం. ఇది ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది, బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తనాళాలు, గుండెకు నష్టం జరగకుండా రక్షించే విటమిన్ బి6 కూడా అధిక స్థాయిలో ఉంటుంది. అరటిపండ్లు రుచికరమైనవి, పచ్చిగా, స్మూతీలలో లేదా అరటిపండు రొట్టెగా కూడా తినవచ్చు.
అయితే, మరీ ఎక్కువ అరటిపండ్లు (రోజుకు మూడుకు మించి) తినకుండా చూసుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన మోతాదులో పొటాషియం ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, అధిక పొటాషియం హైపర్కలేమియా అనే పరిస్థితికి దారితీస్తుంది. ఇది మూత్రపిండాల పనిచేయని వారికి ప్రమాదకరం. “అరటిపండ్లు తినే విషయంలో స్థిరత్వం ముఖ్యం. అప్పుడప్పుడు ఎక్కువ తినడం కంటే క్రమం తప్పకుండా, మితంగా తీసుకోవడం మంచిది,” అని ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఫిజిషియన్ ఏంజెలో ఫాల్కోన్ తెలిపారు.
పొటాషియం అధికంగా ఉన్న ఇతర ఆహారాలలో అవకాడో, పాలకూర, చిలగడదుంప, నారింజ, సాల్మన్, ఆప్రికాట్లు, బ్రోకలీ ఉన్నాయి. ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన ఎంపికలను ఎలాంటి ఆహారంలోనైనా సులభంగా చేర్చుకోవచ్చు. రుచిని తగ్గించకుండానే గరిష్ట రక్తపోటు ప్రయోజనాలను అందిస్తాయి.