సుఖోయ్. రష్యా సాంకేతికత కలిగిన సూపర్ ఫైటర్ జెట్ ఇది. ఇందులో చాలా రకాలున్నాయి. ఐదు జెనరేషన్లు కూడా కలిగి ఉన్న ఫైటర్ జెట్ రకం ఇది. ప్రపంచంలో అత్యాధునిక.. అత్యంత శక్తివంతమైన యుద్ధవిమానాలతో పోటీపడి గెలవగల సత్తా ఉన్న ఫైటర్ జెట్ ఇది. ఇందులో SU-30MKI వేరియంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సుఖోయ్లో సక్సెస్ఫుల్ ఫైటర్ జెట్. దీన్ని భారత్లోనే రూపొందించింది రష్యా. వారి టెక్నాలజీకి.. మనోళ్ల సాంకేతికత జోడించి నిర్మించిన SU-30MKI మన అమ్ములపొదిలో ప్రధాన ఆయుధంగా నిలిచింది. భారత వాయుసేనకు తురుపుముక్కలా నిలిచిన ఈ ఫైటర్ జెట్.. త్వరలోనే మరింత అప్గ్రేడ్ కాబోతోంది. 20 ఏళ్లుగా సేవలందిస్తూ.. ఎన్నో యుద్ధాల్లో తోడ్పాటునందించిన SU-30.. కొత్త రూపంతో రాబోతోంది. దీనికి సంబంధించిన కీలక ఒప్పందం చేసుకుంది భారత్.
చైనాలోని చింగ్డావ్లో నిర్వహించిన షాంఘై సహకార సంస్థ సమావేశానికి హాజరయ్యారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆయన రష్యా రక్షణ మంత్రి ఆండ్రియే బెలౌసోవ్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కీలక విషయాలు చర్చకు వచ్చాయి. రెండు బ్యాచ్ల ఎస్-400 క్షిపణుల సత్వర సరఫరా, భారత్ వద్ద ఉన్న సుఖోయ్ 30-ఎంకేఐ యుద్ధ విమానాల ఆధునికీకరణ, ఎయిర్ టు ఎయిర్ ప్రయోగించే క్షిపణుల తయారీ వంటి అంశాలపై రష్యా రక్షణ మంత్రితో చర్చించారు.
భారత్ దగ్గర రష్యాలో రూపొందిన 260 సుఖోయ్ 30- ఎంకేఐ విమానాలు ఉన్నాయి. ఈ విమానాలను ఆధునికీకరించాలని భారత్ ఆకాంక్షిస్తోంది. ఇటీవలి ఆపరేషన్ సిందూర్లో సుఖోయ్ విమానాలు కీలక పాత్ర పోషించాయి. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా భారత రష్యా రక్షణ మంత్రులు ఇరుదేశాల మధ్య రక్షణ సహకారం బలోపేతం చేసే విషయంతోపాటు, సీమాంతర ఉగ్రవాదం వంటి భౌగోళిక, రాజకీయ విషయాలపై దృష్టిసారించారని భారత రక్షణశాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది.
చర్చల సందర్భంగా ఆండ్రే బెలూసోవ్ పహల్గాం ఉగ్రదాడిపై భారత్కు సంఘీభావం తెలిపారు. ఇటీవలి కాలంలో ఇరు దేశాల నేతల మధ్య జరిగిన అతి కీలక సమావేశం ఇది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రక్షణ ఉత్పాదన పెంపొందించాల్సిన ఆవశ్యకత పెరిగిన నేపథ్యంలో ఈ సమావేశం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని రక్షణ శాఖ తెలిపింది.
ఇక చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్తోనూ రాజ్నాథ్ భేటీ అయ్యారు. భారత చైనాలు తమ మధ్య ఉన్న ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి ప్రణాళిక రూపొందించుకోవాలని, ఉద్రిక్తతల సడలింపు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా రాజ్నాథ్ చెప్పారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారానికి నాలుగు అంశాల ఫార్ములాను రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఒకటి.. 2024లో కుదిరిన బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉండటం, రెండోది ఉద్రిక్తతలను తగ్గించేందుకు నిరంతర ప్రయత్నాలు, మూడు సరిహద్దుల గుర్తింపు-నిర్ధరణ లక్ష్యాలను సాధించేందుకు చర్యలు, చివరిది విభేదాలను తొలగించి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థను కొనసాగించడం. ఈ నాలుగు అంశాలతో కూడిన ప్రణాళికను రాజ్నాథ్ సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
మొత్తంగా.. త్వరలోనే సుఖోయ్ విమానాల అప్గ్రెడేషన్ ఉండబోతోంది. దీనికి రష్యా ముందుకొచ్చింది. అది గనుక జరిగితే మన ఎయిర్ఫోర్స్ పవర్ ఇంకా పెరగబోతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..