నగరంలో మరో ఫ్లైఓవర్ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. గచ్చిబౌలి ట్రాఫిక్ను తగ్గించేందుకు పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. హీరో నాగార్జునపై కీలక వ్యాఖ్యలు చేశారు. N కన్వెన్షన్లో 2 ఎకరాల భూమిని.. నాగార్జున స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారన్నారు సీఎం రేవంత్. భూమిని అప్పగించిన నాగార్జున నిజమైన హీరో అని కొనియాడారు. నగరంలో చాలా నాలాలు, చెరువులు కబ్జాలకు గురయ్యాయని.. హైడ్రా ద్వారా ఆక్రమణలను తొలగిస్తున్నామన్నారు.
హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మార్చాలి. నగరంలో ఆర్టీసీ డీజిల్ బస్సులు ఉండొద్దని నిర్ణయించామని సీఎం రేవంత్ చెప్పారు. వాటిని జిల్లాలకు తరలించాలని అధికారులను ఆదేశించానని తెలిపారు. ఆటోలు కూడా సీఎన్జీ, ఎలక్ట్రిక్కి మారాలి. ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తిగా పన్ను మినహాయింపు ఇస్తామని సీఎం మాటిచ్చారు. 35సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని, కేంద్రమంత్రులను కలిశానన్న సీఎం రేవంత్.. రాష్ట్రానికి చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు రాలేదన్నారు. మెట్రో, మూసీ ప్రాజెక్టులకు కేంద్రం సహకరించడం లేదు. రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ అభివృద్ధిపై పని చేద్దామని పిలుపునిచ్చారు సీఎం రేవంత్.