రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలపై వేధింపులకు పాల్పడిన 141 మంది ఆకతాయిలను SHE Teams అటకట్టించారు. వీరిలో 42 మంది మైనర్లు ఉండటం గమనార్హం. జూన్ 1వ తేదీ నుంచి 15 తేదీ వరకు వాట్సాప్, డైరెక్ట్ కంప్లైంట్లు, సోషల్ మీడియాలో వచ్చిన 163 ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకున్నారు.
మెట్రో రైళ్లు, స్టేషన్లు, బస్టాపులు, ఆఫీసులు, కాలేజీల వంటి హాట్ స్పాట్లలో వేధింపులు చోటుచేసుకున్నాయని పోలీస్ అధికారుల తెలిపారు. అరెస్ట్ అయిన వారందరికీ ఎల్బీనగర్లోని పోలీస్ కమిషనర్ క్యాంప్ ఆఫీస్లో శిక్షణ పొందిన కౌన్సిలర్లు, ప్రొఫెషనల్ సైకాలజిస్టుల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. మైనర్లకు సీనియర్ సైకాలజిస్టుల ద్వారా ప్రత్యేకంగా కౌన్సిలింగ్ అందించారు. అదే సమయంలో మెట్రో రైళ్లు తదితర ప్రాంతాల్లో డేకాయ్ ఆపరేషన్ల ద్వారా ఆరుగురిని పట్టుకుని జరిమానాలు విధించారు.
ఇక బాల్య వివాహాలపై అవగాహన కల్పించేందుకు స్వయం సహాయక సంఘాల సహకారంతో రాచకొండ పోలీసులు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రెండు బాల్య వివాహాలను అడ్డుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు SHE Teams సేవలను అభినందించారు. ఎటువంటి ఇబ్బంది ఎదురైనా మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి SHE Teamsను సంప్రదించాలని కోరారు. అవసరమైతే రాచకొండ వాట్సాప్ కంట్రోల్ నంబర్ 8712662111 లేదా డయల్ 100 కు కాల్ చేయాలని సూచించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..