Raymond Group investments in Anantapur: ఏపీకి పెట్టుబడులు భారీగా తరలి వస్తున్నాయి. ఎన్డీఏ కూటమి చర్యలతో ప్రముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు రేమండ్ గ్రూప్ ముందుకు వచ్చింది. గార్మెంట్, ఆటో మొబైల్ విడిభాగాలు, ఏరో స్పేస్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనుంది. రేమండ్ గ్రూప్ రూ.1,201.95 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ నేపథ్యంలో రేమండ్ గ్రూప్నకు భూములు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రేమండ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో రూ.1,201.95 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. రేమండ్ గ్రూప్ పెట్టుబడుల ద్వారా సుమారుగా 6,571 మందికి ఉపాధి లభిస్తుంది. ఇక రాప్తాడు వద్ద ఏర్పాటు చేసే గార్మెంట్ యూనిట్ కోసం 26.87 ఎకరాలను రేమండ్ గ్రూప్కు ఏపీ ప్రభుత్వం కేటాయించింది. ఎకరా రూ.20 లక్షల చొప్పున భూమిని కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది. అలాగే టేకులోడు దగ్గర ఏర్పాటు చేసే ఆటో మొబైల్ విడిభాగాల తయారీ యూనిట్ కోసం రేమండ్ సంస్థకు 29.52 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. ఎకరా రూ.37.72 లక్షల చొప్పున ఏపీ ప్రభుత్వం కేటాయించింది. గుడిపల్లి వద్ద ఏర్పాటు చేసే ఏరోస్పేస్ తయారీ యూనిట్ కోసం రేమండ్ గ్రూప్కు ఏపీ ప్రభుత్వం 24.39 ఎకరాలను కేటాయించింది. ఎకరా రూ.45.95 లక్షలకు చొప్పున కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో రేమండ్ గ్రూప్ పెట్టుబడులతో గ్రామీణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వ్యవసాయంపై ఆధారపడి జీవించే ఈ ప్రాంతాల్లో పరిశ్రమల అభివృద్ధి వల్ల స్థానికులకు ప్రయోజనం చేకూరుతుంది. మరోవైపు అనంతపురం జిల్లాలో గిన్ఫ్రా ప్రెసిషన్స్ సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు కూడా ఏపీ ప్రభుత్వం ఆనుమతి ఇచ్చింది.
తిమ్మసముద్రంలో గిన్ఫ్రా ప్రెసిషన్స్ సంస్థ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. రూ.1,150 కోట్లతో గిన్ఫ్రా ప్రెసిషన్స్ సంస్థ బైమాడ్యులర్ ఛార్జ్ సిస్టమ్స్ తయారీ యూనిట్ నెలకొల్పనుంది. ఈ తయారీ యూనిట్ కోసం తిమ్మసముద్రంలో ఎకరం రూ.8.30లక్షల చొప్పున ఏపీ ప్రభుత్వం 121.53 ఎకరాలను గిన్ఫ్రా ప్రెసిషన్స్ సంస్థకు కేటాయించింది. ఈ మేరకు అనుమతులు కూడా మంజూరు చేసింది.