తమ కుమార్తె కనిపించకుండా పోయిందని ఓ కుటుంబం పవన్ కళ్యాణ్ ను వేడుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 20 రోజుల నుండి కనిపించకుండా పోయిన బాలిక కేసును పోలీసులు 48 గంటల్లో చేధించారు. డిప్యూటీ సీఎం సభలో ప్లకార్డులు ప్రదర్శించడంతో పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయం వెళ్లింది. వెంటనే స్పందించిన పోలీసులు బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. నిరసన తెలిపితేనే స్పందిస్తారా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో.. తమ కుమార్తెను కాపాడాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో బాలిక మిస్సింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. పైగా పవన్ దృష్టికి చేరిన 48 గంటల్లోనే పోలీసులు కేసును చేధించారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించడంపై హర్షం వ్యక్తం చేస్తున్న జనాలు.. నిరసన తెలిపితే గాని పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. బాధిత మార్వాడి కుటుంబం సుమారు 18 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కరప గ్రామానికి వచ్చి సెటిల్ అయ్యారు. వ్యాపారం చేసుకుంటూ అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇదిలా ఉంటే జూన్ 8వ తారీఖున తమ పద్నాలుగేళ్ల కుమార్తె కనపించకుండా పోయింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఈ కేసును పట్టించుకోలేదు. ఫిర్యాదు చేసి రెండు వారాలపైనే అవుతున్నా తమ బిడ్డ ఆచూకీ గుర్తించలేదు.
దీంతో విసిగిపోయిన బాలిక తల్లిదండ్రులు.. తమ కుమార్తను కాపాడమంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహాయం కోరారు. ఆయనను కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ కాకినాడకు వస్తున్నారని తెలుసుకుని తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు. ఇందుకోసం ముందుగా .. విమానాశ్రయం వద్ద, ఆ తర్వాత సభలో కూడా ప్లకార్డులను ప్రదర్శించి.. తమకు సాయం చేయాలని కోరారు. ‘పవన్ అన్నా మా బిడ్డ కనిపించడం లేదు.. 20 రోజులవుతున్నా మాకు ఇంకా న్యాయం జరగలేదు.. సాయం చేయన్నా’ అంటూ వేడుకున్నారు.
తమ బిడ్డ కనిపించకుండా పోయినప్పటి నుంచి.. తమ పక్కింట్లో ఉండే 23 ఏళ్ల యువకుడు కూడా కనిపించడం లేదని.. తమకు అతడిపైనే అనుమానంగా ఉందని తెలిపారు. పోలీసులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని.. కనీసం డిప్యూటీ సీఎంను కూడా కలిసే అవకాశం ఇవ్వడం లేదని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. విమానాశ్రయం వద్ద కూడా పోలీసులు తమను అడ్డుకున్నారని తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చివరకు వారి నిరసన ఫలించి 48 గంటల్లోనే వారి బిడ్డ ఆచూకీని గుర్తించారు పోలీసులు.