ఇకపై టూ వీలర్ కొనే వారు.. కచ్చితంగా రెండు హెల్మెట్లు కొనాల్సిందే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోనుంది. వాహనం నడిపేవారికి, వెనుక కూర్చున్న వారికి కూడా హెల్మెట్ తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మోటార్ వాహనాల రూల్స్-1989 కు పలు ముఖ్యమైన మార్పులను చెయ్యాలని కేంద్రం ప్రతిపాదించింది. కొత్త సవరణ నియమాల తుది నోటిఫికేషన్ అధికారిక గెజిట్లో ప్రచురించిన తర్వాత మూడు నెలల్లోపు ఈ రూల్ తప్పనిసరి అవుతుందని ప్రభుత్వ నోటిఫికేషన్ పేర్కొంది.
వాహనం నడిపే వారితో పాటు వెనక కూర్చున్న వారి భద్రత కోసం కొత్త నిబంధనను కేంద్రం అమలులోకి తీసుకురానుంది. హెల్మెట్ నిబంధనతో పాటు ప్రభుత్వం మరో భద్రతా చర్యను కూడా ప్రతిపాదించింది. 2026, జనవరి 1 నుంచి 50 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం లేదా గంటకు 50 కిలోమీటర్ల వేగం దాటే మోటార్ సైకిళ్లు, స్కూటర్లు సహా అన్ని కొత్త ఎల్2 క్యాటగిరీ ద్విచక్ర వాహనాలకు యాంటీ-లాక్ బ్రేకింగ్ వ్యవస్థ(ఏబీఎస్) లను అమర్చాలని సూచనలు జారీచేసింది. వాహనానికి ఆకస్మికంగా బ్రేక్ వేసిన సమయంలో వాహనాన్ని నియంత్రించడానికి, దానితో పాటు వాహనం జారిపోయే అవకాశాలను కూడా తగ్గిస్తుంది అని నివేదికలో స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి