రైల్వే ప్రయాణికులపై దొంగలు తెగబడుతున్నారు. వారం రోజుల వ్యవధిలో మూడో సారి చెయిన్ స్నాచింగ్ యత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరపడంతో దొంగలు పారిపోయారు. స్పెషల్ ట్రెయిన్స్ ను టార్గెట్ చేసిన బీహారి ముఠా ప్రయాణీకులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. గుంటూరు సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణికులను బీహారి ముఠా టార్గెట్ చేసింది. పిడుగురాళ్ల నడికుడి మధ్య ఈ ముఠా రైళ్ళలో వరుస చోరీలకు పాల్పడుతుంది. రైల్వే ట్రాక్ – రోడ్డు పక్కపక్కనే ఉండటంతో పాటు పోలీసులు రావడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. రైళ్ళలో చెయిన్ స్నాచింగ్ కు పాల్పడటం వెంటనే రోడ్డు మార్గం గుండా ప్రయాణించి పారిపోవడం సులభంగా ఉన్నట్లు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు భావిస్తున్నారు.
బీహార్ గ్యాంగ్ రాత్రి పన్నెండు గంటల నుండి తెల్లవారి నాలుగు గంటలకు ప్రయాణించే స్పెషల్స్ ట్రైన్స్ ను గుర్తించి వాటిల్లో నే చోరీలు చేస్తున్నారు. గత ఏడాది మే నుండి ఈ జూన్ వరకూ నాలుగు సార్లు రైళ్ళలో పిడుగురాళ్ల నడికుడి మధ్య చోరీలు జరిగాయి. గత ఏడాది మేలో చోరీలకు పాల్పడటంతో ఈ ఏడాది మే నెల అంతా జిఆర్పిఎఫ్, సిఆర్పిఎఫ్ పోలీసులు అప్రమత్తంగా ఉండి చోరీలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండటాన్ని గమనించిన దొంగలు మే నెలను వదిలేసి జూన్ నెల చివరి వారంలో వరుస వెంట చోరీలకు పాల్పడ్డారు.
మొదట 22వ తేదిన స్పెషల్ ట్రెయిన్ టార్గెట్ చేసిన ముఠా 60 తులాలకు పైగా బంగారు ఆభరణాలను తెంచుకొని పోయారు. ఈ నెల 27వ తేదిన మరోసారి విశాఖ చర్లపల్లి స్పెషల్ ట్రెయిన్ లో చెయిన్ స్నాచింగ్ కు పాల్పడి 65 తులాల బంగారు ఆభరణాలను తెంచుకొని పోయారు. ప్రయాణీకులు సికింద్రాబాద్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడోసారి 28 తేది రాత్రి చోరి యత్నం చేయడంతో ఎస్సై వెంకటాద్రి కాల్పులు జరిపారు. రానున్న రోజుల్లో చోరీలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..