ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అందుకు కారణం కేతిరెడ్డి రాక. దీంతో పోలీసులు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఏడాది తర్వాత ఆయన తిరిగి రావడంతో జేసీ వర్గీయులు వ్యతిరేకించారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులతో ఆయన ఇంటికి వెళ్లారు. శాంతి భద్రతల దృష్ట్యా కేతిరెడ్డిని పోలీసులు అనంతపురం తరలించారు. ఎన్నికల సమయంలో కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పూర్తి వివరాలు మీ కోసం..
హైలైట్:
- తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్
- తాడిపత్రి నివాసంలో ప్రత్యక్షమైన కేతిరెడ్డి
- అదుపులోకి తీసుకున్న పోలీసులు

కేతిరెడ్డికి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఉంది. అయితే న్యాయస్థానం ఆదేశాలు పాటించకపోవడంతో.. కొన్నిరోజుల క్రితమే ఆయన కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగానే కేతిరెడ్డి తన ఇంటికి రావడంతో తాడిపత్రిలో టెన్షన్ నెలకొంది. కేతిరెడ్డి తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తాడిపత్రి రావడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తాడిపత్రిలోని ఆయన నివాసంలోనే కేతిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి అనంతపురం తరలిస్తున్నారు. జిల్లాలో శాంతి భద్రతల సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తాను విజయం సాధించినా లేక ఓడిపోయినా సరే.. తాడిపత్రిలో మాత్రం ఫ్యాక్షనిజం చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలోనే టీడీపీ నేతలు గత కొంత కాలంగా కేతిరెడ్డిని తాడిపత్రి రాకుండా అడ్డుకుంటున్నారు. దీనిలో భాగంగానే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఎట్టి పరిస్థితుల్లోనూ కేతిరెడ్డిని తాడిపత్రికి రానివ్వబోనని గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై కేతిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
ఇక న్యాయస్థానం ఆదేశాల మేరకే తాను తన నివాసానికి వచ్చానని.. కొద్ది సేపటికే పోలీసులు తనను అదుపులోకి తీసకున్నారని కేతిరెడ్డి తెలిపారు. ఇక ఆదివారం నాడు ఆయన తన నివాసంలో ప్రత్యక్ష్యం కావడంతో.. తాడిపత్రిలో పొలిటికల్ టెన్షన్ రాజుకుంది. పోలీసులు తాడిపత్రి పట్టణంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా చూడటం కోసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.