
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మరోసారి కశ్మీర్పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత వ్యతిరేక శక్తులకు బహిరంగంగా మద్దతు ఇచ్చేలా మాట్లాడారు. మరణించిన ఉగ్రవాదులను అమరవీరులు అని ఆయన అభివర్ణించారు. జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను చట్టబద్ధమైన పోరాటం అని పేర్కొన్నారు. ఈ కార్యకలాపాలకు రాజకీయ, నైతిక, దౌత్యపరమైన మద్దతను పాకిస్థాన్ అందిస్తుందని తెలిపారు.
శనివారం కరాచీలోని పాకిస్తాన్ నావల్ అకాడమీలో మునీర్ మాట్లాడుతూ.. ఎటువంటి రెచ్చగొట్టే చర్యలు లేకపోయినా భారత్ తమపై రెండుసార్లు దాడి చేసిందని మునీర్ అన్నారు. భవిష్యత్తులో భారతదేశం చేసే ఏదైనా దురాక్రమణకు నిర్ణయాత్మక ప్రతిస్పందనను ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు. భారత్ నుంచి తీవ్రమైన రెచ్చగొట్టే చర్యలు ఉన్నప్పటికీ పాకిస్థాన్ సంయమనం, పరిణతితో వ్యవహరించిందని పేర్కొన్నారు.
కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన మునీర్.. “ఇటువంటి సమయంలో, భారత్ అక్రమ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్న మన కశ్మీరీ సోదరుల త్యాగాలను మనం గుర్తుంచుకోవాలి” అని ఆయన పేర్కొన్నారు. “ఐక్యరాజ్యసమితి తీర్మానాలు, కశ్మీరీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యకు న్యాయమైన పరిష్కారం కోసం పాకిస్తాన్ బలమైన న్యాయవాది” అని కూడా తెలిపారు. కశ్మీర్ సమస్యకు న్యాయమైన, శాంతియుత పరిష్కారం కనుగొనే వరకు, దక్షిణాసియాలో శాశ్వత శాంతి సాధ్యం కాదని అన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసినందుకు మరణించిన ఉగ్రవాదులను అమరవీరులుగా అభివర్ణిస్తూ మునీర్ వారికి నివాళులర్పించారు.
కాగా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని చాలా కాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్, ప్రపంచ సమాజాన్ని తప్పుదారి పట్టించడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద సంఘటనల పెరుగుదలతో, ముఖ్యంగా వజీరిస్తాన్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా వంటి ప్రాంతాల్లో నెలకొన్ని హింస నేపథ్యంలో మునీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పెరుగుతున్న రాజకీయ అస్థిరత, విస్తృతమైన అసంతృప్తితో ఉన్న పాక్ ప్రజల దృష్టి మరల్చేందుకు ఆయన కశ్మీర్ అంశంపై ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి