
ఇటీవల మధ్యప్రదేశ్లో నిర్మించిన ఓ రైల్వే బ్రిడ్జి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ నిర్మాణం సాధారణ రైల్వే బ్రిడ్జ్ల నిర్మాణానికి భిన్నంగా 90 డిగ్రీల మలుపుతో నిర్మించడమే. ఈ బ్రిడ్జిని L ఆకారంలో నిర్మించడంతో ప్రారంభానికి ముందే దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యాయి. దీంతో ఈ బ్రిడ్జ్ నిర్మాణంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో అధికారులు బ్రిడ్జ్ ప్రారంభోత్సవాన్ని నిలిపివేశారు.
కాగా ఇక బ్రిడ్జ్ నిర్మాణ విషయం ప్రభుత్వం దృష్టికి చేరడంతో స్థానిక ప్రజాప్రతినిథులతో పాటు అధికారులపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్రిడ్జ్ నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని భావించిన ప్రభుత్వం తాజాగా బ్రిడ్జి నిర్మాణం కోసం పనిచేసిన ఏడుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరో విశ్రాంత చీఫ్ ఇంజినీర్పై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
ఇక వ్యవహారంపై స్వయంగా సీఎం మోహన్ యాదవ్ స్పందిస్తూ..బ్రిడ్జ్ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్సెండ్ చేయడంతో పాటు బ్రిడ్జ్ నిర్మాణంపై విచారణకు కూడా ఆదేశించినట్టు తెలిపారు. అంతే కాకుండా బ్రిడ్జ్ నిర్మాణ ఏజెన్సీ, డిజైన్ రూపొందించిన కన్సల్టెంట్లను బ్లాక్లిస్టులో ఉంచినట్టు ఆయన తెలిపారు. ఈ బ్రిడ్జిని పునరుద్దరించేందుకు మరో కమిటీ ఏర్పాటు చేసినట్టు కూడా ఆయన తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..