
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వైద్య విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది. మెడికల్, డెంటల్ విద్యార్థులతో పాటు సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే స్టయిఫండ్ను 15 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని వేలాది మంది వైద్య విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచినట్లైంది. 15 శాతం స్టైఫండ్ పెంపుతో ఇంటర్న్లకు నెలకు 29వేల 792 రూపాయలు, పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్ 67వేల 32 రూపాయల స్టైఫండ్ అందనుంది. ఇక సెకండియర్లో 70వేల 757 రూపాయలు, ఫైనల్ ఇయర్కు 74వేల 782 రూపాయల స్టయిఫండ్ అందనుంది.
స్టైఫండ్ పెంపుతో పాటు, తెలంగాణ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న దాదాపు 16వేల 448 మంది ఉద్యోగుల సర్వీసును మరో ఏడాది పాటు పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పొడిగింపు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పని చేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగులకు వర్తిస్తుంది. వీరిలో 4,772 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 8,615 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది, 3,056 మంది గౌరవ వేతన పద్ధతిలో పని చేస్తున్నవారు.. మరో 5 మంది MTS ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి