ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్షా నిజామాబాద్ రైతుల దశాబ్దాల కలను సాకారం చేస్తూ, జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసుపు రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. 40 ఏళ్ల నిజామాబాద్ రైతుల పోరాటానికి ఎన్డీఏ ప్రభుత్వం ముగింపు పలికిందన్నారు. ఈ బోర్డుతో పాటు, భారత్ ఆర్గానిక్, భారత్ ఎక్స్పోర్ట్ సంస్థలను కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇకపై నిజామాబాద్ పసుపు ప్రపంచవ్యాప్తంగా తన ఖ్యాతిని చాటుతుందన్నారు
ఇదిలా ఉండగా రాష్ట్రంలోని విపక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ పోయింది కానీ, అవినీతి మాత్రం పోలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో కేవలం అధికారం మాత్రమే మారింది, దోపిడీ తీరు మాత్రం మారలేదన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలకు ఏటీఎంగా మారిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం “ధరణి పోర్టల్, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల అవినీతికి పాల్పడితే.. కాంగ్రెస్ పార్టీ ఎందుకు దానిపై విచారణ జరిపించట్లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని.. అందుకే బీఆర్ఎస్ అవినీతిని కాంగ్రెస్ కప్పిపుచ్చుతుందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో ఇన్నాళ్లు ఉన్న కేసీఆర్ కుటుంబ పాలన పోయి, ఇప్పుడు ఢిల్లీ కుటుంబ పాలన వచ్చిందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.