దేశంలోని నక్సలిజంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని కేంద్ర హోంమంత్రి అమిత్షా మరోసారి స్పష్టం చేశారు.. ఈ సందర్భంగా ఆపరేషన్ కగార్పై కీలక వ్యాఖ్యలు చేశారు.. 2026 నాటికి నక్సలిజాన్ని తుదముట్టిస్తామంటూ అమిత్ షా ప్రకటించారు. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా.. అనంతరం జరిగిన కిసాన్ సభలో ఆపరేషన్ కగార్ అంశాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్ కగార్ ఆపేది లేదని అన్నారు. మావోయిస్టులు హత్యాకాండ వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు. లేదంటే మావోయిస్టుల నిర్మూలన కొనసాగిస్తూనే ఉంటామన్నారు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్ట్ ముక్త్ భారత్ను సాధిస్తామన్నారు. మావోయిస్టులను అంతం చేయాలా వద్దా..మీరే చెప్పండి.. అంటూ ప్రశ్నించారు. మావోయిస్ట్లు హత్యాకాండ విడిచి తక్షణం లొంగిపోవాలి.. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలి అంటూ సూచించారు.
ఆదివాసీల పేరుతో మావోయిస్టులు విధ్వంసం సృష్టిస్తున్నారన్నారు అమిత్ షా. నక్సలైట్లకు తెలంగాణ అడ్డా కాబోదన్నారు. గతంలో నక్సలైట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు జరిపిందని.. తాము కాంగ్రెస్ మాదిరి కాదని స్పష్టం చేశారు. ఆయుధాలు పట్టుకున్నోళ్లతో ఎట్టి పరిస్థితుల్లో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా ఆదివాసీలను అభివృద్దిని మావోయిస్టులను అడ్డుకుంటున్నారని అమిత్షా అన్నారు. మావోయిస్టులు 40 వేల మంది గిరిజనులను చంపారని ఆరోపించారు. ఇప్పటికే 10వేల మంది నక్సలైట్లు లొంగిపోయారని.. మిగతా వాళ్లు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు.
బీఆర్ఎస్ కాంగ్రెస్ పై విమర్శలు..
కాగా.. నిజామాబాద్ కిసాన్ సమ్మేళన్ సభ సాక్షిగా బీఆర్ఎస్, కాంగ్రెస్పై తూటాల్లాంటి విమర్శలతో అమిత్షా విరుచుకు పడ్డారు. పదేళ్ల కేసీఆర్ పాలన అవినీతిమయమని.. కుటుంబ పాలనను తిరస్కరించి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ సర్కార్ను ఎన్నకుంటే రేవంత్ ప్రభుత్వంలో అవినీతిలో బీఆర్ఎస్ను మించిపోయిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని..ఇక రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అంటూ అమిత్షా పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..