తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్రావుకు వరుస బెదిరింపుకాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవలే ఓ ప్రోగ్రాంలో ఉండగా ఎంపీ రఘునందన్రావుకు ఫోన్ చేసిన ఓ గుర్తుతెలియని వ్యక్తి తనను లేపేస్తామని బెదిరింపులకు పాల్పడగా ఈ విషయాన్ని ఎంపీ రఘునందన్ రాష్ట్ర డీజీపీతో పాటు మెదక్, సంగారెడ్డి జిల్లాల ఎస్పీల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనకు అదనపు భద్రత అవసరమని గ్రహించిన తెలంగాణ పోలీస్ శాఖ. కేంద్రబలగాలతో కూడిన ఎస్కార్ట్ను రఘునందన్రావుకు కేటాయించింది.
ఇదిలా ఉండగా ఆదివారం మరోసారి ఆయనకు బెదిరింపుకాల్ వచ్చింది. ఇటీవలే కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న రఘునందన్రావు, ప్రస్తుతం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలోనే కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు మరో బెదిరింపు కాల్ వచ్చింది. రెండు వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి ఫోన్ చేసిన ఆగంతకులు.. తాము ఆంధ్రప్రదేశ్ మావోయిస్టు కమిటీకి చెందిన వారిమని .. కమిటీ ఆదేశాల మేరకు మిమల్ని చంపడానికి 5 బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయని చెప్పినట్టు సమాచారం. మాటీం ఇప్పటికే నగరంలోకి ప్రవేశించిందని కాసేపట్లో మిమ్మల్ని లేపేస్తామని..దమ్ముంటే నిన్ను నువ్వు కాపాడుకోమని రఘునందన్ను బెదిరించినట్టు తెలుస్తోంది.
మీ పోలీసులు మా ఫోన్లను ట్రేస్ చేసేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా మా ఆచూకీ దొరకదని, ఎందుకంటే తాము ఇంటర్నెట్ కాల్స్ ఉపయోగిస్తున్నామని ఆ వ్యక్తులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వారు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..