యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని విస్తరించింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని UAE రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది.. కొత్త నిబంధన ప్రకారం, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, న్యూజిలాండ్, కొరియా, సింగపూర్ నుంచి చెల్లుబాటు అయ్యే నివాస అనుమతులు కలిగిన భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లు అన్ని UAE ఎంట్రీ పాయింట్ల వద్ద వీసా ఆన్ అరైవల్ పొందేందుకు అర్హులని.. ఈ సదుపయాన్ని ఇకపై వినియోగించుకోవచ్చని వెల్లడించింది. ఈ కొత్త సౌకర్యం ఫిబ్రవరి 13, 2025 నుంచి అమలు చేయబడింది. దీనికి ముందు, భారత పౌరులు చెల్లుబాటు అయ్యే వీసా, నివాస అనుమతి లేదా US, యూరోపియన్ యూనియన్ (EU) లేదా యునైటెడ్ కింగ్డమ్ (UK) కు సంబంధించిన గ్రీన్ కార్డ్ కలిగి ఉంటేనే UAEలో వీసా ఆన్ అరైవల్ పొందేవారు. ఇప్పుడు ఈ జాబితాలో మరో ఆరు దేశాలను చేర్చారు.. దీంతో భారతీయ ప్రయాణికులకు UAEకి ప్రయాణం మరింత సులభతరం అయింది.
రెండు దేశాల మధ్య దౌత్య, మానవ సంబంధాలను బలోపేతం చేయడంలో సులభమైన, బహిరంగ ప్రయాణ నిర్వహణ పెద్ద పాత్ర పోషిస్తుందని UAE ప్రభుత్వం తెలిపింది. ఈ చొరవ ముఖ్యంగా భారతదేశం – UAE వంటి ఆర్థికంగా, సాంస్కృతికంగా, వ్యూహాత్మకంగా అనుసంధానించబడిన దేశాలకు నమ్మకం – సహకారానికి చిహ్నంగా పనిచేస్తుందని UAE ప్రభుత్వం ప్రకటించింది.
భారతదేశంలోని యూఏఈ రాయబారి అబ్దుల్నాసర్ అల్షాలీ, ఈ చొరవను భారతదేశం-యుఎఇ భాగస్వామ్యానికి బలమైన సంకేతంగా అభివర్ణించారు.
“భారతీయ పౌరుల కోసం యుఎఇ వీసా-ఆన్-అరైవల్ ప్రోగ్రామ్ విస్తరణ రిపబ్లిక్ ఆఫ్ ఇండియాతో మా శాశ్వత భాగస్వామ్యానికి ప్రతిబింబం. ఇది ఎన్నో కుటుంబాలు తిరిగి కనెక్ట్ అవ్వడానికి, నిపుణుల సహకారానికి, వ్యాపారాలు సరిహద్దుల వెంబడి అభివృద్ధి చెందడానికి సులభతరం చేసే ఒక ఆచరణాత్మక అడుగు. రెండు డైనమిక్ – భవిష్యత్తును చూసే దేశాలుగా, మన ప్రజలు – ఆర్థిక వ్యవస్థల మధ్య మరింత బలమైన వంతెనలను నిర్మించడానికి మేము కట్టుబడి ఉన్నాం” అని ఆయన చెప్పినట్లు ANI పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..