సంగారెడ్డి పాశ మైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సీగాచి కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. రియాక్టర్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పేలుడు శబ్దంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో 20మందికి పైగా కార్మికులకు తీవ్రంగా గాయపడినట్టుగా తెలిసింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఘటనా స్థలానికి భారీగా అంబులెన్సులు, 108 సిబ్బంది చేరుకున్నారు. అటు కార్మికుల కుటుంబ సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో కంపెనీ దగ్గరకు చేరుకుంటున్నారు. ప్రమాదంలో తీవ్రగాయాలైన వారికి పటాన్చెరులో ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు.
ఫ్యాక్టరీలో పేలుడు దాటికి భవనం కుప్పకూలిపోయింది. పేలుడు ధాటికి కార్మికులు సైతం 100మీటర్ల దూరం ఎగిరిపడినట్టుగా తెలిసింది. ఎగిసి పడుతున్న మంటలు, దట్టమైన పొగతో పాటుగా ఆ ప్రాంతమంతా ఘాటైన వాసన అలుముకుంది. ఆ వాసనతో కార్మికులు ఊపిరి రాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫ్యాక్టరీ పరిసరాలు, చుట్టుపక్కల వారిని వెంటనే అక్కడ్నుంచి ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. ప్రమాదంలో ఐదుగురు కార్మికులు సజీవదహనమైనట్టుగా తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఘటనా స్థలానికి ఎవరూ రావొద్దని అధికారులు సూచించారు. ఘటనా స్థలంలో నాలుగు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు సిబ్బంది.
ఈ కంపెనీలో మెడిసిన్స్ కి సంబంధించిన పౌడర్ తయారు చేస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారని చెబుతున్నారు. కంపెనీలో దాదాపు 100 మంది వరకు పనిచేస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. కంపెనీలో పనిచేస్తున్న తమ వాళ్లకు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయటం లేదని చెబుతున్నారు. ఈ రోజు ఉదయం 9గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్టుగా తెలిసింది. ఫ్యాక్టరీ లోపల చిక్కుకున్న వారి కోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
సమాచారం అందిన వెంటనే సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్, ఎస్పీ హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పరిశీలస్తున్నారు. రియాక్టర్ పేలుడుకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..