Nara Lokesh Praises Govt Teacher: ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో నమ్మకం పెంచేందుకు ఉపాధ్యాయుడు వాసుదేవరావు తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించారు. విజయనగరం జిల్లా రాజాం సమీపంలోని డోలపేటకు చెందిన ఆయన గడిముడిదాం పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె నాలుగో తరగతి, కుమారుడు రెండో తరగతి చదువుతున్నారు. మంత్రి నారా లోకేష్ సైతం వాసుదేవరావును ప్రశంసించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చదివించాలని ఆయన ఆకాంక్షించారు.
హైలైట్:
- ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్ణయం
- వాసుదేవరావుపై లోకేష్ ప్రశంసలు
- ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకొద్దాం

ప్రభుత్వ టీచర్ వాసుదేవరావుపై మంత్రి లోకేష్ ప్రశంసలు.. ఇంతకీ ఎవరీ వాసు మాస్టారు
హిందీ ఉపాధ్యాయుడు వాసుదేవరావుపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు.. ఆయన ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ‘ప్రభుత్వ పాఠశాలల ముందు నో అడ్మిషన్ బోర్డులు చూస్తుంటే ఇది కదా నేను కోరుకున్న మార్పు అనిపిస్తోంది. రాజకీయాలకు దూరంగా, సమగ్ర విద్యకు దగ్గరగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి, సమస్యలను పరిష్కరించి విద్యాలయాలుగా పాఠశాలలను తీర్చిదిద్దిన కష్టం .. రాజాం నియోజకవర్గం డోలపేటకు చెందిన టీచర్ డోల వాసుదేవరావు లాంటి వారిని చూసి మర్చిపోతాం. తన పిల్లలు ఇద్దరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నారు ఈ మాస్టారు. ఒక మాస్టారే తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తుంటే, మనం ఎందుకు చదివించకూడదు అని ప్రజల్లో ఆలోచన రేకెత్తించిన వాసు మాస్టర్ కి అభినందనలు. మన బడికి మనమే అంబాసిడర్స్ గా నిలుద్దాం. అంతా కలిసి దేశానికే దిక్సూచిగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకొద్దాం’ అంటూ వాసు మాస్టారుపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. వాసుదేవరావు మాస్టారు మాత్రమే కాదు మరికొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తమ పిల్లల్ని సర్కారీ బడుల్లోనే చేర్పిస్తున్నారు.