ఓ ప్రయాణికుడు బ్యాంకాక్ నుంచి ముంబైకి ఫ్లైట్లో వచ్చాడు.. ఎయిర్పోర్టులో దర్జాగా విమానం దిగి.. సూట్కేసుతో హాయిగా నడుచుకుంటూ బయటకు వస్తున్నాడు.. ఇంతలోనే అతని నడవడికపై అక్కడి అధికారులకు ఏదో అనుమానం కలిగింది.. దీంతో అతన్ని ఆపి ప్రశ్నించారు. ముందు తడబడ్డాడు.. దీంతో ఫుల్లుగా చెక్ చేశారు.. అయినా ఏదో తేడా కొడుతుండటంతో అతని బ్యాగ్ ను ఓపెన్ చేశారు. క్షుణ్ణంగా పరిశీలించారు. దీంతో ఏవో కాటన్ ప్యాకెజ్ లు దర్శనమిచ్చాయి.. వాటిని చెక్ చేయగా.. బుసలు కొడుతున్న పాములు దర్శనమిచ్చాయి.. అవన్నీ సజీవంగా ఉండటంతో అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ ప్రయాణికుడి నుంచి దాదాపు 16 పాములను స్వాధీనం చేసుకోవడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ షాకింగ్ ఘటన జూన్ 27 (శుక్రవారం) న ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. పాములను స్మగ్లింగ్ చేస్తున్న బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
అతని బ్యాగులో 16 సజీవ పాములను కనుగొన్నామని.. ఇవి పలు దేశాలకు చెందిన అరుదైన పాములని అధికారులు తెలిపారు. స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వెల్లడించారు. ముంబై కస్టమ్స్ జోన్-III అధికారులు ఆకస్మిక తనిఖీ తర్వాత.. ప్రయాణికుడి బ్యాగుల్లో పాములను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. బ్యాంకాక్ నుంచి విమానం 6E1052లో ప్రయాణించిన భారతీయుడిని.. ముంబైకి రాగానే అడ్డుకున్నామని.. అయితే.. ప్రశ్నించే సమయంలో ప్రయాణీకుడు భయాందోళనకు గురైనట్లు అధికారులు తెలిపారు.. దీని ఫలితంగా అతని లగేజీని మరింత తనిఖీ చేయగా.. కాటన్ సంచులలో ఉంచిన అనేక రకాల పాములు కనుగొన్నట్లు తెలిపారు.

Snakes
వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద అన్ని జంతువులను స్వాధీనం చేసుకుని.. కస్టమ్స్ చట్టం, 1962 నిబంధనల ప్రకారం ప్రయాణీకుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వన్యప్రాణి చట్టాలకు అనుగుణంగా, స్వాధీనం చేసుకున్న సరీసృపాలను వాటి స్వదేశానికి తిరిగి పంపించడానికి కస్టమ్స్ అధికారులతో వైల్డ్లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో సమన్వయం చేసుకుంటోందని అధికారులు ధృవీకరించారు. పాములను నిర్వహించడంలో, గుర్తించడంలో కస్టమ్స్కు రెస్కింక్ అసోసియేషన్ ఫర్ వైల్డ్ లైఫ్ వెల్ఫేర్ (RAWW) నిపుణులు సహాయం చేశారని.. తదుపరి దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..