
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే మంజీరా బ్యారేజీకి ఎలాంటి ముప్పులేదని జలమండలి ఎండీ అశోక్రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆదివారం ఆయన జలమండలి ఉన్నతాధికారులతో కలిసి మంజీరా బ్యారేజ్, గేట్లు, పిల్లర్లు, పంప్హౌజ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి మంచినీరు అందించడానికి నిర్మించిన మంజీరా బ్యారేజ్కు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. అలాగే బ్యారేజ్కి సంబంధించిన గేట్లు, రోప్ల పనితీరు కూడా సంతృప్తిగానే ఉన్నట్లు చెప్పారు. అయితే బ్యారేజ్ దిగువన ఆఫ్రాన్ కొంతమేరకు దెబ్బతిన్నదని వెంటనే మరమ్మత్తులకోసం ఏజెన్సీతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. అలాగే రెండవగేటు లీకేజీను అరికట్టడానికి మరమ్మత్తు పనులను చేపట్టాలని స్వప్న ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సంస్థకు సూచించారు.
బ్యారేజీపై గేట్లు, రోలర్, ప్యానల్ బోర్డ్స్, ఎలక్ట్రో మెకానికల్ తదితర భాగాలను పరిశీలించిన ఎండీ ఎప్పటికప్పుడు గ్రీజు, కలరింగ్, లైటింగ్ తదితర ఏర్పాట్లను చేసుకోవాలని అధికారులకు సూచించారు. స్పిల్వే ఇరుప్రక్కల్లో ఫెన్సింగ్ ఏర్పాటుచేసి మానవ సంచారం నిరోధించాలని తెలిపారు. అలాగే ఆనకట్టపై మొలిచిన చెట్లు, కంపచెట్ల తొలగింపు వారంలోపల పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
యేళ్లు గడిచిన బారాజ్ గేట్లు..
మాంజీరా బ్యారేజ్ 65 సంవత్సరాల క్రితం నిర్మితమైందని, అప్పుడు బిగించిన గేట్లు ప్రతీఏటా నిర్వహణపనులు చేపడుతున్నా గేట్లు, రోప్లు, బేరింగ్లను మార్చాలని అధికారులు అంచనా వేశారని అన్నారు. దానికనుగుణంగా గత ఏడాది మే నెలలో 3.52 కోట్లతో ప్రతిపాదనలను పూర్తిచేసి, టెండర్ ప్రక్రియ పూర్తిచేసి ఏజెన్సీని నియమించామని వివరించారు. ఏజెన్సీ గేట్ల బిగింపు కాకుండా మిగతా పనులను పురోగతిలో ఉన్నట్టు.. ఆ తరువాతే స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ నిన్న నే సమర్పించిందని చెప్పారు.
రిపేర్లకు 45 రోజులు నీటి సరఫరాలో ఆటంకం..
బ్యారేజీ పై గేట్లను మార్చడానికి దాదాపు 45 రోజులు పడుతుందని అంచనా వేస్తున్నట్టు, అలాగే జలాశయంలోని మొత్తం నీటిని MDL దిగువకు వదలవలసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. అన్నిరోజులు హైదరాబాద్ నగరానికి 40 ఎంజీడీల నీటి కొరత ఏర్పడుతుందని వివరించారు. నగరవాసులకు తాగునీటి ఇక్కట్లు రాకుండా ఉండేందుకే కొత్తగేట్ల అమరిక వాయిదా వేస్తున్నట్లు ఈ సందర్భంగా ఎండీ పేర్కొన్నారు. గతంలో 2019 ఫిబ్రవరి నుంచి అక్టోబర్ 2020 వరకు బారాజ్లో నీటిని వినియోగించలేదని.. ఆ సమయంలో గేట్ల రిపేర్ పనులు చేపట్టి ఉంటే నీటిసరఫరాలో అంతరాయం లేకుండా ఉండేదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి 2047 విజన్..
రానున్న 20 సంవత్సరాల్లో తెలంగాణ కోర్ అర్బన్ పరిధిలో మౌలిక సదూపాయాలను కల్పన భాగంగా.. సమృద్ధిగా నీటి సరఫరాకు సంకల్పించారు. అందులో భాగంగానే జలమండలికి గోదావరి ఫేజ్ 2,3 రూ. 7360 కోట్లు మంజూరు చేశారు. అలాగే భవిష్యత్తు అవసరాలకోసం మాంజీరా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును ఆధునికీకరణ పనులకోసం రూ. 600 కోట్లతో డీపీఆర్ను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాము. దానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధునికీకరణ పనులతోపాటు ఇప్పుడున్న మాంజీరా ఫేస్ 1,2 మంచినీరు సరఫరా పైపులైనులతోపాటు మరో కొత్త పైపులైనును నిర్మించాలని సూచించారు. దాంతోపాటు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం ఈ ప్రాజెక్టు పనులలో బాగంగా చేపట్టనున్నారు.
ప్రతిపాదిత తెలంగాణ కోర్ అర్బన్ పరిధిలో ప్రస్తుతం ఉన్న రిజర్వాయర్ల సంఖ్య, నీటి నిల్వ సామార్థ్యం ఎంత? 2047 వరకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇంకెన్ని రిజర్వాయర్లు అవసరమవుతాయో డీపీఆర్ సమర్పించాల్సిందిగా సీఎం ఆదేశించారు. అలాగే రేడియల్ రోడ్లకు సమాంతరంగా ట్రంక్ మెయిన్స్, ఓఆర్ ఆర్ చుట్టూ రింగ్ మెయిన్ అభివృద్ధిచేసి ఏ సోర్స్నుంచి అయినా ఏ ప్రాంతానికైనా నీటిని సరఫరా చేసేవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.
దాంతోపాటు కోర్ అర్బన్ పరిధిలోని భవిష్యత్తులో బహుళ అంతస్థులు వచ్చే ప్రాంతాలను గుర్తించి, అప్పటి అవసరాలను అంచనా వేసి, ఇప్పుడే అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించుకోవాలని ఆదేశించారు. దానికి సంబంధించిన డీపీఆర్ రూపకల్పనకోసం కన్సల్టెన్సీలను నియమించుకోవాలని సీఎం సూచించారు. దానికనుగుణంగా గోదావరి ఫేజ్ 2,3 ప్రాజెక్టు, హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ రిజర్వాయర్ల నుంచి వేరువేరుగా 20 ఎంజీడీల అదనపు నీటిని తరలించడానికి, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణంకోసం చేపడుతున్నారు. గండిపేట్ కాండూట్ రిపేర్లకు ప్రతిపాదనలను సిద్ధం చేశారు.
అలాగే కోర్ అర్బన్ పరిధిలో తాగునీటితోపాటు సీవరేజ్ లైన్ల నిర్మాణం, ఎస్టీపీల నిర్మాణంలతోపాటు ఎస్టీపీలలో శుద్ధిచేసిన నీటిని పునర్వినియోగంకోసం సహితం దీర్ఘకాలిక ప్రణాళికను సిద్ధం చేశారాని వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..