ఒక మహిళ మృతదేహం చెత్త లారీలో ఒక గోనె సంచిలో దొరికిన విషయం బెంగళూరు వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ మృతదేహం ఎవరిది? ఎందుకు ఆమెను హత్య చేసి, అందులో పడేశారు? హత్యకు కారణమేంటనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టి.. ఒక్కరోజులో కేసు ఛేదించి, మిస్టరీ వీడేలా చేశారు. బెంగళూరు పౌర సంస్థ బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP)కు చెందిన చెత్త లారీలో ఆదివారం మహిళ మృతదేహాన్ని ఒక గోనె సంచిలో పారిశుద్ధ్య కార్మికులు గుర్తించారు. ఆ మహిళ చేతులు కట్టి, ఆ సంచిలో కుక్కి లారీలో పడేశారు. బెంగళూరు పోలీసులు హత్య కేసు నమోదు చేసి, మృతదేహాన్ని శవపరీక్షకు పంపి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను పరిశీలించి, నిందితుడు అస్సాంకు చెందిన 33 ఏళ్ల మహ్మద్ షంషుద్దీన్గా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
చెత్త లారీలో లభించిన మృతదేహాన్ని ఆశా అనే మహిళదిగా గుర్తించారు. ఆమె మొహమ్మద్ షంషుద్దీన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉంది. ఆశా (40), షంషుద్దీన్ ఏడాదిన్నర కాలంగా కలిసి ఉంటున్నారు. సౌత్ బెంగళూరులోని హులిమావులోని ఒక ఇంటని అద్దెకు తీసుకొని.. అక్కడే సహజీవనం చేస్తున్నారు. ఆశా, షంషుద్దీన్ ఇద్దరికీ వేర్వేర్వు వ్యక్తులతో వివాహాలు అయ్యాయి. ఇద్దరికీ పిల్లలు కూడా ఉన్నారు. అయితే, వారు సమాజానికి తమను తాము భార్యాభర్తలుగా పరిచయం చేసుకున్నారు. ఆశా తన భర్త చనిపోవడంతో అర్బన్ కంపెనీలో పనిచేస్తుంది.
మహ్మద్ షంషుద్దీన్ భార్య, ఇద్దరు పిల్లలు అస్సాంలోనే ఉన్నారు. కానీ, అతను ఇక్కడే బెంగళూరులో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆశాతో పరిచయం అయింది. ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు. అయితే కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, అది ఘర్షణగా మారి ఆశ మరణానికి దారితీసిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) లోకేష్ తెలిపారు. షంషుద్దీన్ ఆశాను గొంతు కోసి చంపినట్లు చెబుతున్నారు. ఆశను హత్య చేసిన తర్వాత, షంషుద్దీన్ మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లి, చెత్త లారీలో పడేసి అక్కడి నుండి పారిపోయాడు. ఈ సంఘటన సీసీటీవీలో రికార్డైంది. దాని ఆధారంగానే షంషుద్దీన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి