
మధ్యప్రదేశ్లోని మోరేనా జిల్లాలోని ధుర్కుడా కాలనీలో జరిగిన ఘటన స్థానికుల్ని కన్నీరు పెట్టించిందట. ప్రాణప్రియుడిని కోల్పోయిన ఆడ సర్పం తన భాగస్వామి పక్కనే 24 గంటల పాటు నిలిచి ఉందని స్థానికులు చెబుతున్నారు. భాగస్వామిని విడిచి బతకలేక ఆ పాము కూడా ప్రాణాలు వదిలిందట. ఈ ఘటన గురువారం పహడ్గఢ్ పంచాయతీ సమితి పరిధిలో వెలుగుచూసిందని ఓ డిజిటల్ మీడియా పబ్లికేషన్ వెల్లడించింది. రహదారిపై వాహనం తొక్కడంతో మగ సర్పం మరణించింది. గ్రామస్తులు ఆ మగ పామును రోడ్డుకు పక్కన ఉంచగా.. కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న ఆడ సర్పం అక్కడ ఉండి తన బాధను వ్యక్తపరిచింది. ఏ కదలిక లేకుండా మగ పామును చూసుకుంటూ తీరని దుఃఖంలో మునిగిపోయిందట.
ఆ ఆడ సర్పం తమకు ఏదో చెప్పాలన్నట్లు ప్రయత్నించిందని గ్రామస్థులు తెలిపారు. దాదాపు 24 గంటల పాటు తన ప్రాణసఖుడి పక్కనే ఉండి.. చివరకు తాను కూడా ఈ లోకాన్ని వీడింది. ఈ హృదయ విదారక ఘటన చూసిన గ్రామస్థులందరూ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. మరో జన్మలో అయినా వాటి జీవనం ఎల్లకాలం ఉండాలని కాంక్షిస్తూ.. సంప్రదాయ బద్దంగా అంత్యక్రియలు నిర్వహించారు.
సనాతన ధర్మంలో నాగుల్ని ప్రత్యేకంగా పూజిస్తారన్న విషయం తెలిపిందే. అందుకే ఆ పాముల అనురాగానికి గుర్తుగా.. గ్రామస్థులు ఆ ప్రదేశంలో ఓ వేదిక నిర్మించాలని నిర్ణయించారు. అది వారి ప్రేమకు చిహ్నంగా నిలిచిపోయేలా ఉంటుందని చెబుతున్నారు. ఈ ఘటన పాములలోని బంధాలకు గొప్ప సాక్ష్యంగా నిలుస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..