ఈ అధ్యయనం ప్రముఖ వైద్య పరిశోధనా పత్రిక అయిన ఆక్యుపేషనల్ అండ్ ఎన్విరాన్ మెంటల్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురించారు. దీన్ని స్వీడన్ కు చెందిన కరోలిన్స్కా ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు రూపొందించారు. ఈ అధ్యయనం లక్ష్యం.. ఉద్యోగ ప్రదేశంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడి, మనుషుల మధ్య సంబంధాల్లో కలిగే తేడాలు, ఆరోగ్యంపై ప్రభావాన్ని విశ్లేషించడం.
పనిలో ఎక్కువ ఒత్తిడి, ముఖ్యంగా సహోద్యోగులతో కలిగే భావోద్వేగ సంబంధిత గొడవలు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని మహిళలలో 24 శాతం, పురుషులలో 20 శాతం వరకు పెంచుతాయని ఈ అధ్యయనం స్పష్టంగా చెబుతోంది. ఇది ఉద్యోగ ప్రదేశంలో మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.
ఈ పరిశోధనలో 2005లో స్వీడన్ లో నమోదైన దాదాపు 30 లక్షల మందికి పైగా వ్యక్తుల డేటాను పరిశీలించారు. వీరిలో వైద్యం, విద్య, ప్రభుత్వం వంటి 20 వేర్వేరు రంగాల ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 2006 నుంచి 2020 మధ్య కాలంలో 2 లక్షలకు పైగా వ్యక్తులు టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది పురుషులే.
పని వాతావరణంలో ఎదురయ్యే ఒత్తిడికి ప్రధాన కారణాలుగా సహోద్యోగులతో మనస్పర్థలు, భావోద్వేగపూరిత ఒత్తిడి, మానసిక అవమానాలు లేదా బెదిరింపులు, ఉద్యోగ భద్రతపై స్పష్టత లేకపోవడం వంటివి ఉన్నాయి. ఈ అంశాలన్నీ కలగలిసి శరీరంలోని హార్మోన్ల స్థాయిలను అస్తవ్యస్తం చేస్తాయని.. దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత పెరిగి చివరికి టైప్ 2 డయాబెటిస్ కు దారితీస్తుందని శాస్త్రజ్ఞులు వివరించారు.
పనిలో ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో కోర్టిసోల్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. ఎక్కువ కాలం ఇలాగే కొనసాగితే.. శరీరంలో ఇన్సులిన్ తక్కువగా పనిచేసే పరిస్థితి ఏర్పడి.. చివరకు టైప్ 2 డయాబెటిస్ వస్తుంది.
ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఉద్యోగ స్థలాల్లో సానుకూల వాతావరణం, సహృదయ సంభాషణ, ఒత్తిడి నియంత్రణ, మెడిటేషన్, ఫిట్ నెస్ చర్యలు తప్పనిసరి. ముఖ్యంగా ఉద్యోగులు వారానికి ఒకసారి తమ ఆరోగ్యాన్ని స్వయంగా పరిశీలించుకోవడం మంచిది.
పనిలో ఒత్తిడి తప్పనిసరి అయినప్పటికీ.. దానిని సమర్థంగా ఎదుర్కోవడం మన చేతిలోనే ఉంటుంది. ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా పనిచేయడం కన్నా.. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడం ఎంతో మంచిది. మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశమే ఎక్కువ. కాబట్టి ఉద్యోగ ఒత్తిడిని తగ్గించుకోవడంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలి.