Srisailam Istakameswari devi temple close for Three months: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి దేవాలయం సందర్శనను అధికారులు నిలిపివేయనున్నారు. మూడు నెలల పాటు ఇష్టకామేశ్వరి దేవి యాత్రకు బ్రేక్ పడనుంది. జులై ఒకటి నుంచి సెప్టెంబర్ 31 వరకూ ఇష్టకామేశ్వరి దేవి సందర్శనకు భక్తులను అనుమతి ఇవ్వడం లేదు. ఈ మూడు నెలలు పులుల సంతానోత్పత్తి సమయం కావటంతో అటవీశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జంగిల్ రైడ్ పేరుతో అటవీ శాఖ ఈ ఆలయానికి వాహనాలను నడిపేది.

ఇష్టకామేశ్వరి దేవి ఆలయం నల్లమల అడవిలో కొలువై ఉంది. ఆలయానికి వెళ్లే దారిలో కొండలు, అటవీ ప్రాంతం ఉంది. ఇష్టకామేశ్వరి ఆమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. అయితే పులుల సంతానోత్పత్తి సమయం కావటంతో మూడు నెలలపాటు ఇష్టకామేశ్వరి దేవి యాత్రను అటవీశాఖ అధికారులు నిలిపివేశారు.
మరోవైపు శ్రీశైలం ఆలయానికి సంబంధించి ఆదివారం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శ్రీశైలం లడ్డూలో బొద్దింక కనిపించిందంటూ వీడియో వైరల్ అయ్యింది. ఒక భక్తుడికి లడ్డూలో బొద్దింక కనిపించగా.. అతను వెంటనే ఈ విషయంపై ఆలయ సిబ్బందిని ప్రశ్నించారు. అయితే ఆలయ సిబ్బంది ఆ లడ్డూను లాక్కున్నారని భక్తుడు ఆరోపించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీంతో మల్లన్న భక్తులు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదే కనుక నిజమైతే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు శ్రీశైలంలో బులెట్లు, బాంబులు కనిపించిన ఘటన ఇటీవల కలకలం రేపిన సంగతి తెలిసిందే. శ్రీశైలం ఆలయానికి కూత వేటు దూరంలోనే రోడ్డు డివైడర్ వద్ద ఇవి బయటపడటం స్థానికంగా సంచలనం రేపింది. అయితే పోలీసుల విచారణలో ఇవి పోలీస్ విభాగానికి చెందినవిగా తేలింది. ఓ పోలీస్ సిబ్బంది బుల్లెట్లు ఉన్న సంచిని అక్కడ మరిచిపోయినట్లు విచారణలో వెల్లడైంది. అయితే ఈ ఘటన మాత్రం తీవ్ర సంచలనం రేపగా.. భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు.