హైదరాబాద్, జూన్ 30: తెలంగాణ రాష్ట్రంలోని యూజీ, పీజీ మెడికల్ కోర్సులు చదువుతున్న విద్యార్ధులకు రేవంత్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. మెడికల్ విద్యార్ధుల స్టైపెండ్ భారీగా పెంచుతూ ప్రకటన జారీ చేసింది. మెడికల్ విద్యార్ధుల స్టైపెండ్ను దాదాపు 15 శాతం పెంచింది. వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు జీవో విడుదల చేసింది. పెంచిన స్టైపెండ్లు హౌస్ సర్జన్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) డిగ్రీ, డిప్లొమా విద్యార్థులు, సూపర్-స్పెషాలిటీ మెడికల్, డెంటల్ ట్రైనీలు, సీనియర్ రెసిడెంట్లకు అందించనున్నట్లు తెలిపింది. పెరిగిన స్టైపెండ్ జనవరి 1, 2025 నుంచి అమలులోకి వచ్చేలా ప్రభుత్వం ఈ మేరకు జీవో జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో డెంటల్, ఎంబీబీఎస్, మాస్టర్స్ ఇన్ డెంటల్ సర్జరీ (MDS)లో సూపర్ స్పెషాలిటీ చేస్తున్న డాక్టర్లు ప్రయోజనం పొందనున్నారు.
తాజా ప్రకటన ప్రకారం.. హౌస్ సర్జన్లకు (మెడికల్/డెంటల్ రెండూ) నెలవారీ స్టైఫండ్ గతంలో రూ. 25,906 ఉంటే అది రూ. 29,792కు పెరుగుతుంది. పీజీ (డిగ్రీ) మొదటి సంవత్సరం వైద్యులకు స్టైఫండ్ రూ. 67,032, రెండవ సంవత్సరం రూ. 70,757, మూడవ సంవత్సరం రూ. 74,482లకు పెరిగింది. పీజీ (డిప్లొమా) మొదటి సంవత్సరం వైద్యులకు స్టైఫండ్ రూ. 67,032, రెండవ సంవత్సరం రూ. 70,757కు పెరిగింది.
మొదటి సంవత్సరం సూపర్-స్పెషాలిటీ వైద్యులకు రూ. 1,06,461, రెండవ సంవత్సరం రూ. 1,11,785, మూడవ సంవత్సరం రూ. 1,17,103 చొప్పున స్టైఫండ్ అందిస్తారు. సూపర్-స్పెషాలిటీ MDS డెంటల్ వైద్యులకు మొదటి సంవత్సరం స్టైఫండ్ రూ. 67,032, రెండవ సంవత్సరం రూ. 70,757, మూడవ సంవత్సరం రూ. 74,482 చొప్పున చెల్లిస్తారు. అలాగే సీనియర్ రెసిడెంట్లకు గౌరవ వేతనం రూ. 1,06,461కు పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం (జూన్ 29) జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.