క్వాంటం వ్యాలీ.. సిలికాన్ వ్యాలీ తరహాలో ఏపీలో ఒక సరికొత్త సాంకేతిక విప్లవం! చంద్రబాబు నాయుడు ఆలోచనలతో, దేశంలోనే మొదటిసారిగా అమరావతిలో క్వాంటం వ్యాలీ రూపుదిద్దుకుంటోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, పరిశోధన కేంద్రాలతో, స్టార్టప్లతో నిండిన ఈ వ్యాలీ.. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో నిలుపుతుందనడంలో సందేహం లేదు. దీని ద్వారా రాష్ట్రానికి ఎలాంటి లాభాలు చేకూరనున్నాయో చూడాలి.

ఈ క్రమంలోనే విజయవాడలో అమరావతి క్వాంటం వ్యాలీ నేషనల్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఐటీ, ఫార్మా, నిర్మాణ రంగం, వాణిజ్య రంగాలకు చెందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు. టీసీఎస్, ఐబీఎం, ఎల్అండ్టీ సహకారంతో దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీ టెక్ పార్కు అమరావతిలో ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఏపీ ప్రభుత్వం ఉంది.
క్వాంటం వ్యాలీ.. అంటే ఏమిటి?
భారతదేశంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్, టెక్నాలజీ హబ్.. అమరావతి క్వాంటం వ్యాలీ. 2026 జనవరి 1వ తేదీన అమరావతి క్వాంటం వ్యాలీని ప్రారంభించాలని భావిస్తున్నారు. 2031 నాటికి క్వాంటం టెక్నాలజీలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్గా నిలపడమే లక్ష్యంగా 6,000 వేల కోట్లతో జాతీయ క్వాంటం మిషన్ ఏర్పాటైంది. అందులో భాగంగానే అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్కు ఏర్పాటు చేయనున్నారు.
Quantum valley: అమరావతి క్వాంటం వ్యాలీ.. ఇందులో ఏం ఉంటాయ్?
అమరావతి క్వాంటం వ్యాలీ ముఖ్యాంశాలు:
అమరావతి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్లో దేశంలోనే అత్యంత శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్ అయిన.. 156-క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్తో పనిచేసే IBM క్వాంటం సిస్టమ్ టూ ఏర్పాటు చేయనున్నారు. ఇదే గనుక వాస్తవ రూపం దాల్చితే భారతదేశంలోనే అతిపెద్ద క్వాంటం కంప్యూటర్ కానుంది. ఎల్ అండ్ టీ, ఐబీఎం, టీసీఎస్ సహకారంతో అమరావతి క్వాంటం వ్యాలీ టెక్ పార్కు ఏర్పాటు కానుంది. టీసీఎస్, ఐబీఎం వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో విద్యా సంస్థలు, స్టార్టప్లు, పరిశ్రమల కోసం ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయనున్నారు.. TCS సహకారంతో లైఫ్ సైన్సెస్, క్రిప్టోగ్రఫీ, మెటీరియల్స్ సైన్స్, ఎనర్జీ ఆప్టిమైజేషన్ వంటి రంగాలలో క్వాంటం అల్గారిథమ్లు, అప్లికేషన్లను అభివృద్ధి చేయనున్నారు.
అమరావతి క్వాంటం వ్యాలీలో ఏం ఉంటాయి?
అమరావతి క్వాంటం వ్యాలీలో క్వాంటం కంప్యూటింగ్, ఏఐ రీసెర్చ్ కోసం కేంద్రాలు, స్టార్టప్స్, ఐటీ కంపెనీల ఆవిష్కరణల్లో సహకారానికి ఇంక్యుబేషన్ సెంటర్లు, ఏఐ నిపుణుల తయారీకి ట్రైనింగ్ కేంద్రాలు, హైటెక్ ల్యాబ్స్, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.
క్వాంటం వ్యాలీ ద్వారా.. ఆంధ్రప్రదేశ్కు వచ్చేదేంటి?
అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ ద్వారా.. క్వాంటం రీసెర్చర్స్, సైంటిస్టులు, ఇంజనీర్లను రాష్ట్రానికి ఆకర్షించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే క్వాంటం రీసెర్చ్, డెవలప్మెంట్లో దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, ఫైనాన్సియల్ మోడలింగ్, హెల్త్ కేర్, ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీస్లో అడ్వాన్స్ క్వాంటం కంప్యూటింగ్ అప్లికేషన్లు తీసుకురానుంది.
మరోవైపు అమరావతి క్వాంటం వ్యాలీని రెండు దశల్లో ఏర్పాటు చేయనున్నారు. తొలివిడతలో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యారంగం, పైలెట్ ప్రోగ్రాముల మీద దృష్టిపెట్టనున్నారు. రెండో దశలో క్వాంటం టెక్నాలజీ కమర్షియలైజేషన్, ఎక్స్పోర్ట్స్ మీద దృష్టి సారించనున్నారు. క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ కోసం ఏపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.4000 కోట్లు కేటాయించనుంది. దీనితో పాటుగా జాతీయ క్వాంటం మిషన్ నుంచి కూడా కేంద్రం సహకారం అందించనుంది.