ఖమ్మం జిల్లాలో కుటుంబ కలహాలతో ఓ S.I భార్య ఆత్మహత్య చేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఖమ్మం జిల్లా బూడిదంపాడు గ్రామానికి చెందిన రాజేశ్వరిని…రఘునాథపాలెం మండలం రాములతండాకు చెందిన రాణా ప్రతాప్కు ఇచ్చి పెళ్లి చేశారు. వారి ఎనిమిదేళ్ల దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలున్నారు. రాణా ప్రతాప్ ప్రస్తుతం ఖమ్మం రైల్వే ఎస్సైగా పని చేస్తున్నాడు. అయితే కొంతకాలం నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో రాజేశ్వరి నాలుగు రోజుల క్రితం పురుగుల మందు తాగింది. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స తీసుకుంటూ రాజేశ్వరి మృతి చెందింది. దీంతో ఆస్పత్రి మార్చురీ వద్ద చేరుకున్న మృతురాలి బంధువులు….భర్త తండ్రిపై దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
పెళ్లైనా ఏడాది నుంచే భర్త, మామ, అత్తలు తీవ్రంగా వేధించేవారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. భర్త, అత్తామామలు తీవ్రంగా కొట్టినందువల్లే ఈనెల 26న రాజేశ్వరి పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
అత్తింటివారే చంపేశారని బంధువుల ఆరోపణ
అత్తింటివారే తన బిడ్డను చంపేశారని ఆరోపిస్తున్నారు రాజేశ్వరి తండ్రి.. పెళ్లి అయిన ఏడాది నుంచి ఆడపిల్ల పుట్టిందని తనని నిత్యం వేధించేవారిని చెప్పారు.. ఇప్పటికే రెండుసార్లు అబార్షన్ కూడా చేయించారని.. మగపిల్లల కోసం వేధించి తన బిడ్డను చంపేశారంటూ రాజేశ్వరి తండ్రి వాపోతున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తమ కూతురి మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారికి తగిన శిక్ష పడేలా చూడాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.