
ముంబై, జూన్ 30: నవీ ముంబైలోని ఓ ఫ్లాట్ మూడేళ్లకు పైగా తాళం వేసి ఉంది. అయితే బయటి నుంచి కాదు. ఇంటిలోపలి నుంచి తాళం వేసి ఉంది. ఆ ఇంట్లో అనుప్ కుమార్ నాయర్ అనే టెకీ బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెంచుకుని ఇంటికే పరిమితమయ్యాడు. అతనికి ఉన్న ఏకైక సంబంధం ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు మాత్రమే. కంప్యూటర్ ప్రోగ్రామర్గా పనిచేసిన అనుప్ కుమార్ నాయర్ తల్లిదండ్రులు ఆరు సంవత్సరాల క్రితం మరణించారు. ఆ తర్వాత ఒంటరితనం కారణంగా డిప్రెషన్కు గురయ్యాడు. అతని అన్న 20 ఏళ్ల క్రితం సూసైడ్ చేసుకున్నాడు. ఓ NGOకి అతని పరిస్థితి గురించి చెబుతూ డిస్ట్రెస్ కాల్ ఒకటి వచ్చింది. దీంతో ఆయన ఇచ్చిన సమాచారం మేరకు సోషల్ అండ్ ఎవాంజెలికల్ అసోసియేషన్ ఫర్ లవ్ (SEAL) సామాజిక కార్యకర్తలు సెక్టార్ 24లోని ఘర్కూల్ CHSలోని నాయర్ ఇంట్లోకి వెళ్లారు. ఆ ఫ్లాట్ గజిబిజిగా, మానవ వ్యర్థాలతో నిండిపోయింది.
నాయర్ తన ఫ్లాట్ నుంచి బయటకు రావడానికి నిరాకరించాడని, లివింగ్ రూమ్లోని కుర్చీపై మాత్రమే పడుకునేవాడని సీల్ పాస్టర్ కె.ఎం. ఫిలిప్ అన్నారు. ఆ ఫ్లాట్లో ఫర్నిచర్ ఎక్కడా కనిపించలేదు. అతన్ని చూసినప్పుడు అతని కాలుకి ఇన్ఫెక్షన్ సోకి ఉంది. నాయర్ తన ఫ్లాట్ తలుపు తెరవడం చాలా అరుదుగా కనిపిస్తాడని, చెత్తను కూడా తీయలేదని అతని పక్కింటి వాళ్లు తెలిపారు. సొసైటీ సభ్యులు కొన్నిసార్లు చెత్తను బయటకు తీయడానికి ఎంతో బతిమిలాడవల్సి వచ్చేంది. అతని తల్లిదండ్రుల ఫిక్స్డ్ డిపాజిట్ను అతని ఖాతాకు బదిలీ చేయడానికి మేమంతా సహాయం చేశామని వారు తెలిపారు.
అతని తల్లిదండ్రుల మరణం తర్వాత అతని బంధువులు కొందరు అతన్ని సంప్రదించడానికి ప్రయత్నించారని కానీ అతను ఎవరినీ నమ్మకపోవడంతో వారితో మాట్లాడటానికి నిరాకరించాడని ఇరుగుపొరుగు తెలిపారు. దీంతో SEAL సామాజిక కార్యకర్తలు నాయర్ను పన్వేల్లోని సీల్ ఆశ్రమానికి తరలించారు. తనకు స్నేహితులు లేరని, ఉద్యోగం కూడా దొరకలేదని వారితో నాయర్ తెలిపాడు. అన్నారు. తన తల్లిదండ్రులు, సోదరుడు ఇప్పటికే చనిపోయారు. నా ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల నాకు కొత్త ఉద్యోగం దొరకడం లేదని ఆయన అన్నాడు. కుటుంబ సభ్యులు దూరమవడంతో డిప్రెషన్కు గురై తనకు తానే బయటి ప్రపంచాన్ని వెలివేసినట్లు మానసిక వైద్యులు చెబుతున్నారు. కొందరు కుటుంబ సభ్యుడిని కోల్పోవడం వల్ల ఒంటరితనాన్ని అనుభవించే అవకాశం ఉందది, వీరు డిప్రెషన్కు గురై సామాజికంగా దూరంగా ఉండటం ప్రారంభిస్తారని చెబుతున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే నగరాల్లో కొంతమంది సహాయం కోసం ముందుకు రాలేక ఒంటరి తనానికి గురై నిరాశకు లోనవుతున్నారు. అదృష్టవశాత్తూ నాయర్ని రక్షించగలిగాం. కానీ తాళం వేసిన ఫ్లాట్లలోనే చనిపోయే వారు లెక్కలేనన్ని మంది ఉన్నారు. వారి మృతదేహాలు రోజుల తర్వాతగానీ బయటి ప్రపంచానికి తెలియడం లేదని సీల్ చీఫ్ పాట్రన్ అబ్రహం మథాయ్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.