బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది. బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తెలిపింది. అలాగే ఏపీ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. 3000 టీఎంసీల గోదావరి జలాలు ఏటా సముద్రంలో కలుస్తున్నాయని.. ఇందులో 200 టీఎంసీలు ఉపయోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదించింది.

బనకచర్ల ప్రాజెక్టు లో నీటి నిల్వపై కేంద్ర ప్రభుత్వంతో అధ్యయనం చేయించడం సహా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అనుమతులు, పర్యావరణంపై ఏ మేరకు ప్రభావం పడుతుందనే దానిపై అంచనా వేసిన తర్వాతే బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడానికి అవకాశం ఉంటుందని కమిటీ వెల్లడించింది. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతుల ఇవ్వలేమన్న కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ.. ఏపీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలపై కేంద్ర జలసంఘం సాయంతో వరద నీటి లభ్యతపై అధ్యయనం చేయాలని సూచించింది. అలాగే గోదావరి వాటర్ డిస్పూట్స్ ట్రైబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల పంపిణీపై సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి తీసుకోవాలని తెలిపింది.
మరోవైపు సముద్రంలో వృథాగా కలిసే గోదావరి వరద జలాలను రాయలసీమకు మళ్లించి.. రాయలసీమను సస్యశ్యామలం చేయాలని ఏపీ ప్రభుత్వం భావించింది. గోదావరి నుంచి 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని.. ఇందులో 200 టీఎంసీల నీటిని బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఉపయోగించుకుంటే రాయలసీమకు మేలు కలుగుతుందని సీఎం చంద్రబాబు పదే పదే చెప్తున్నారు. సముద్రంలో వృధాగా కలిసే మిగులు జలాలను రెండు రాష్ట్రాలూ ఉపయోగించుకోవాలని చంద్రబాబు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే రూ. 80,000 కోట్లతో బనకచర్ల ప్రాజెక్టు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాలికలు రచించింది.
అయితే, తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గోదావరి నీటి వివాదాల ట్రైబ్యునల్, పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా బనకచర్ల ప్రాజెక్టును చేపడుతున్నారని.. బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు భంగం కలిగిస్తుందని అభ్యంతరం తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ.. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు నిరాకరించింది.