అమెరికాలో తానా, ఆటా, నాటా సంబరాలు షురు కాబోతున్నాయి. వాటిలో ఆటాపాటాతో సందడి చేయడానికి దాదాపు 15మంది టీడీపీ ఎమ్మెల్యేలు అమెరికాకు వెళ్లారు. మడిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలని, పొలిటికల్ ప్రెజర్ కుక్కర్లో నుంచి బయటపడి, చిల్ అవుదామని చలో అమెరికా అనేశారు శాసనసభ్యులు. తానా, ఆటా, నాటా కార్యక్రమాలు ముగించుకున్నాక నేతాశ్రీలు కొన్నాళ్లు అక్కడ చిల్ అవడం సాధారణంగా జరుగుతూ ఉండే కార్యక్రమమే. ఆటవిడుపు దొరికింది కదా అని అలా అమెరికా వెళ్లి కాస్త జాలీగా ఎంజాయ్ చేద్దామనుకున్నారు. ఇంతలోనే ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్తో వాళ్ల చిల్కు చిల్లు పడింది. అంతా అర్జెంటుగా అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్కు తిరుగు ప్రయాణమయ్యారు. చంద్రబాబు ఝలక్తో తానా, ఆటా సంబరాల్లో ఈసారి పొలిటికల్ ఫ్లేవర్, క్రేజ్ మిస్ కానున్నాయి.
చంద్రబాబు సుతిమెత్తగా చేసిన హెచ్చరికలే ఎమ్మెల్యేల తిరుగుటపాకు కారణమంటున్నాయి టీడీపీ వర్గాలు. ఈమధ్యే జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం. తానా, ఆటా అంటూ ఫారిన్ ట్రిప్పులు వద్దు. గ్రౌండ్ వర్క్ వదిలేసి అలా వెళ్తే ప్రజలు టాటా చెప్పేస్తారు జాగ్రత్త అంటూ నేతలకు హితబోధ చేశారు ముఖ్యమంత్రి.
అయితే టీడీపీ ఎమ్మెల్యేల ఫారిన్ ట్రిప్ విషయంలో వైసీపీ నుంచి మాటల తూటాలు పేలుతున్నాయి. చంద్రబాబులో పాలనా దక్షత తగ్గిందని, ఆయనకు చెప్పకుండానే ఎమ్మెల్యేలు అమెరికాకు చెక్కేశారని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
మొత్తానికి చంద్రబాబు వార్నింగ్తో, మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా జాగ్రత్తపడుతున్నారు.. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..