
వేధిస్తున్నాడని కాలు నరికేశారు.. పూర్తిగా తెగిపడిన ఆ కాలును గ్రామస్తులకు చూపిస్తూ బైక్పై ఊరంతా తిరిగారు నిందితులు. తీవ్ర రక్తస్రావం జరిగి కోలుకోలేక బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సూటి పోటి మాటలతో తరచూ వేధిస్తున్న వ్యక్తి కాళ్లు నరికేసి, దాంతో బైక్పై ఊరేగిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.
కర్నూలు రూరల్ మండలం సూదిరెడ్డిపల్లె గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కురువ శేషన్న అనే 54 ఏళ్ల వ్యక్తి లారీ డ్రైవర్. అదే గ్రామానికి చెందిన పరశురాముడు అనే వ్యక్తిని తరచుగా వేధిస్తున్నాడు. పరశురాముడికి చెవుడు ఉందని, ఏమి చెప్పినా వినపడదని, పరశురాముడి భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నానని అతని వద్దనే గట్టిగా అరుస్తూ చెప్పేవాడు. ఇది భరించలేని పరశురాముడు అదే గ్రామానికి చెందిన కొందరితో తన బాధను చెప్పుకున్నాడు. దీంతో శేషన్నకు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించారు.
ఈ క్రమంలోనే బుధవారం(జూలై 02) అర్ధరాత్రి శేషన్న ఇంట్లోకి దూరిన దుండగులు, వేటకొడవళ్లు, కర్రలు, రాడ్లతో అతనిపై దాడికి తెగబడ్డారు. శేషన్న కాలు తెగిపడింది. తీవ్ర రక్తస్రావం అయింది. శేషన్న భయపడిపోయాడు. భయంతో పాటు రక్తస్రావం జరగడంతో శేషన్న మృతి చెందాడు. శేషన్న కాలును పూర్తిగా నరికేసి.. నరికేసిన కాలును తీసుకుని ముగ్గురు వ్యక్తులు బైక్పై ఊరంతా తిరిగారు. ఈ సంఘటన చూసిన గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు.
అయితే, తెగిపడిన శేషన్న కాలును బైక్ పై నిందితులు తీసుకెళ్లి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత ఆ కాలును తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ దగ్గర పడేశారు. గ్రామానికి చెందిన పరుశురాముడు సహా మొత్తం నలుగురు నిందితులు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. దీనికి వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..