
ఆయన ఓ జిల్లా కలెక్టర్.. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ తాఖీదులు ఇస్తుంటారు. సిబ్బంది పనితీరును తెలుసుకుంటూ సూచనలు ఇస్తుంటారు. తాను పని చేస్తూ..అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తారు. ప్రతి విషయంలోనూ విభిన్నంగా ఆలోచిస్తూ పని చేస్తారు. ఆయన ఎవరో కాదు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్. సాదా సీదాగా ఉంటూ.. అందరినీ కలుపుకుని.. స్వయంగా కొన్ని అంశాల్లో ఆయనే దగ్గరుండి చేసి చూపిస్తారు. ఈ క్రమంలోనే తాజాగా స్థానిక ఫిష్ వ్యాపారులు, మత్స్యకారులతో కలిసి “బోన్లెస్ చేపలు(ముళ్లు లేకుండా) తయారు చేసే విధానం” పై ప్రత్యక్ష ప్రాక్టికల్ డెమో ఇచ్చారు. ఈ విధంగా చేపలను బోన్లెస్గా తయారు చేయడం ద్వారా వాటి మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.
వీడియో చూడండి..
ఈ విధానం నేర్చుకోవడం ద్వారా మత్స్యకారులు, ఆదివాసీ సముదాయాలు, చేపలపై ఆధారపడి జీవించే కుటుంబాలు, స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. బోన్లెస్ చేప ముక్కలను పిల్లలు, పెద్దలు సులభంగా తినగలిగే విధంగా ఉండటంతో మంచి పోషకాహారం అందించే అవకాశం ఉందని కలెక్టర్ జితేష్ పాటిల్ వివరించారు. బోన్లెస్ చేప ముక్కల ద్వారా చికెన్ టిక్కా లాంటి రకరకాల వంటకాలు, ఐటమ్స్ తయారు చేసి, చేపలకు కొత్త విలువ చేర్చవచ్చని తెలిపారు. తద్వారా చేపలను తినే ప్రజలకు కొత్త రుచులు అందించడం, ఆదాయాన్ని పెంచుకోవడం సాధ్యమవుతుందన్నారు.
చేపల, చేపల తలలు, మిగిలిన భాగాలతో పోషక విలువ గల రుచికరమైన సూప్ తయారు చేసి జిల్లావాసులకు అందించడం ద్వారా ఆరోగ్యం, ఆదాయం రెండూ సంపాదించుకోవచ్చునని, అలాగే మిగిలిన వ్యర్థాలను ఎరువుగా వాడటం ద్వారా పర్యావరణం పరిరక్షణతో పాటు అదనపు ఆదాయం పొందవచ్చని జిల్లా కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈ ప్రయత్నం ద్వారా మత్స్యకారులు, ఫిష్ వ్యాపారులు, SHG మహిళలు తమ సామర్థ్యాన్ని పెంచుకుని, ఆరోగ్యకరమైన ఆహారం అందించడంతో పాటు ఆదాయ మార్గాలను కూడా విస్తరించుకోవచ్చని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఈ విధానాన్ని ప్రోత్సహించి మరిన్ని కుటుంబాలు లబ్ధిపొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..