మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో ఐదు నెలలు జైలులో ఉన్న వంశీ బెయిల్పై విడుదలయ్యారు. జైలు జీవితం, కేసుల గురించి జగన్తో చర్చించినట్లు సమాచారం. వంశీపై నకిలీ పట్టాలు, భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు బెయిల్ రద్దుకు నిరాకరించడంతో ఆయన విడుదల సుగమం అయింది. విడుదలైన భర్తను చూసి వంశీ భార్య భావోద్వేగానికి లోనయ్యారు.
హైలైట్:
- టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా వంశీ
- ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసిన పోలీసులు
- జైలు నుంచి విడుదల తర్వాత తొలిసారి జగన్తో భేటీ

విడుదలకు ముందు పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అక్రమ మైనింగ్ కేసులో వంశీకి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టడంతో వల్లభనేని వంశీ విడుదలపై సందేహాలు నెలకొన్నాయి. అయితే, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు ఆసక్తి చూపలేదు. కానీ, ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టు తమ వాదనలను వినకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించారు.
రూ.195 కోట్ల అక్రమ మైనింగ్ జరిగిందని.. దీనికి సంబంధించి సీల్డ్ కవర్లో నివేదిక ఇస్తామని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో నివేదిక ఇచ్చిన తర్వాతే ముందస్తు బెయిల్ అంశాన్ని పరిశీలీస్తామని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అనంతరం విచారణను జులై 16కు వాయిదా వేసింది. దీంతో వల్లభనేని వంశీ విడుదలకు ఆటంకం తొలగిపోయింది. ఇక, జైలు నుంచి దాదాపు 5 నెలల అనంతరం విడుదలైన భర్తను చూసి… వంశీ భార్య పంకజశ్రీ భావోద్వేగానికి గురయ్యారు.