అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. రాత్రి సమయంలో చికాగో లోని ఓ నైట్క్లబ్లో చొరబడిన కొందరు దుండగులు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా..మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. చికాగో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చికాగోలోని రివర్ నార్త్ పరిసరాల్లో గల ఆర్టిస్ లాంజ్ నైట్క్లబ్ వద్ద బుధవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా అక్కడికి వచ్చిన కొందరు దుండగులు తమ దగ్గర ఉన్న తుపాకులతో నైట్క్లబ్ బయట నిలబడి ఉన్న వ్యక్తులపై కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. ఆ వెంటనే అక్కడి నుంచి వారు పారిపోయారు తెలిపారు.
ఈ కాల్పుల్లో సుమారు నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 16 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయిన వారి మృతదేహాలతో పాటు, గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్కు తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాల ఆధారంగా కాల్పులకు పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.