ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి పుష్ప అనే ఓ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినియా సక్సెస్ విషయం పక్కనపెడితే.. ఆ సినిమాలో ఎర్ర చందనం దుంగలను పోలీసులకు చిక్కుకుండా, ఎవరికీ అనుమానం రాకుండా పలుపలు విధాలుగా స్మగ్లింగ్ చేస్తాడు హీరో. పాల వాహనంలో కిందంతా ఎర్ర చందనం పెట్టి.. పైన పాల ట్యాంక్ పెట్టి ఎంచక్కా పోలీస్ చెక్ పోస్ట్ దాటిస్తుంటాడు. ఆ సినిమా నుంచి స్ఫూర్తి పొందారో ఏమో కానీ.. రియాల్గా కూడా అలాంటి చీప్ స్మగ్లింగ్ ఐడియాలు ఫాలో అవుతూ.. ఓ స్మగ్లింగ్ ముఠా పోలీసులకు చిక్కింది. వెయ్యి కిలోల శ్రీగంధం (తెల్ల గంధం) దుంగలు తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని బస్తేపూర్ గ్రామ శివారులో పక్క సమాచారంతో మాదాపూర్ యస్ఓటీ, చేవెళ్ల పోలీసుల ఆధ్వర్యంలో ఈ స్మగ్లింగ్ ముఠాను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని హంట్వాడి గ్రామం నుంచి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగర్ గూడ గ్రామంలోనీ ఆంధ్ర ఫర్ప్యూమ్ ఫ్యాక్టరీకి తరలిస్తున్న 1000 కిలోల శ్రీగంధం (తెల్ల గంధం) స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.30 నుంచి రూ.35 లక్షల రూపాయలు ఉంటుందని చేవెళ్ల ఏసీపీ కిషన్ తెలిపారు. గంధం చెక్కలను తరలిస్తున్న MH25 AJ 3689 నంబర్ గల డీసీఎం వాహనాన్ని తనిఖీ చేయగా.. అందులో క్యాబిన్ వెనుక చిన్న గదిలా ఏర్పాటు చేసి.. అందులో శ్రీగంధం చెక్కలు బస్తాల్లో పెట్టి ఉంచారు.
ఈ స్మగ్లింగ్కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో డ్రైవర్ అబ్దుల్ అజీజ్, సూపర్వైజర్ సోహెబ్, రైతు విజయ్ హనుమంత్ మానె ఉన్నారు. ఫ్యాక్టరీ ఓనర్ అబ్దుల్ కుర్వి, మేనేజర్ సిద్దిక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుకున్న నిందితులను రిమాండ్ కు తరలించారని, పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్లో మాదాపూర్ ఎస్ఓటీ సీఐ సంజయ్, ఎస్ఐ లు సతీష్, అజయ్, సిబ్బంది, రవి కుమార్ ఫారెస్ట్ అధికారి, చేవెళ్ల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి