Nallapareddy Prasanna Kumar Reddy House Attacked,వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇల్లు ధ్వంసం – attack on former mla nallapareddy prasanna kumar reddy house in nellore
వైసీపీ నేత, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి ఘటన కలకలంరేపింది. నెల్లూరులోని కొండాయపాలెం గేటు సెంటర్లో ఉన్న ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిలోని ఫర్నీచర్ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యక్తిగత దూషణలు చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే దాడి జరిగినట్లు చర్చ జరుగుతోంది. ఇది టీడీపీ శ్రేణుల పనే అని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దాడిలో 50 మంది వరకు పాల్గొన్నారని ప్రసన్నకుమార్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో కర్రలతో దాడి చేసి ముందుగా సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. దాడిలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయని ప్రసన్నకుమార్ రెడ్డి అంటున్నారు. దాడి సమయంలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మ ఇంట్లో ఉన్నారు.. దాడి సమాచారం తెలిసిన వెంటనే ప్రసన్నకుమార్రెడ్డికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫోన్ చేసి మాట్లాడారు. అయితే ఈ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అంటున్నారు. దాడుల సంస్కృతి తమది కాదని.. ప్రసన్నకుమార్ వల్ల చాలా మంది బాధపడ్డారన్నారు.. వారిలో ఎవరో ఒకరు దాడి చేసి ఉండొచ్చన్నారు. ‘ఆరోపణలు చేసిన వైసీపీ నేతలకు నాది ఒకటే ప్రశ్న.. నల్లపురెడ్డి నాపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు మీ ఇంట్లో మహిళలకు చూపించండి.. నల్లపురెడ్డివ్యాఖ్యలను జగన్ సీరియస్గా తీసుకోవాలి ‘ అన్నారు.