ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణమ్మకు జలహారతి నిర్వహించేందుకు శ్రీశైలం చేరుకున్నారు. ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో చేరుకున్న ఆయన, భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్నారు. ఎగువ రాష్ట్రాల నుంచి వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా ఉంది. జలాశయం నుంచి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జలహారతి కార్యక్రమం అనంతరం అధికారులు ప్రాజెక్టు నుంచి దిగువకు నీళ్లు విడుదల చేయనున్నారు.
హైలైట్:
- హెలికాప్టర్లో శ్రీశైలానికి చేరుకున్న ముఖ్యమంత్రి
- పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతం పలికిన అర్చకులు
- దర్శనం అనంతరం జలహారతి కార్యక్రమంలో సీఎం

తొలుత శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జలాశయం వద్దకు చేరుకుంటారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా కృష్ణమ్మకు హారతి ఇస్తారు. తొలి ఏకాదశి నుంచి రైతులు దుక్కులు దున్ని పంటలు వేసుకునే సమయం కావడంతో ప్రతి ఏడాది ఈ జలహారతి కార్యక్రమం నిర్వహిస్తారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా నది ఇప్పటికే కళకళలాడుతోంది. శ్రీశైలంలోని కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణ, గోదావరి నదులు జలకళను సంతరించుకున్నాయి. సుంకేశుల, జూరాల నుంచి వరద నీరు శ్రీశైలానికి జలాశయానికి పోటెత్తుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 881.6 అడుగులకు నీరు చేరింది. పై నుంచి 1,72,705 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో 67,563 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలహారతి కార్యక్రమం అనంతరం అధికారులు దిగువకు నీరు విడుదల చేయనున్నారు.